విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం! | Repeated Incidents at Vizag Steel Plant SMS 1 Raise Serious Safety Concerns | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం!

Jun 12 2026 12:39 AM | Updated on Jun 12 2026 1:09 AM

Repeated Incidents at Vizag Steel Plant SMS 1 Raise Serious Safety Concerns

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-1 విభాగంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రావణం కింద పడటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్లాంట్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గురువారం ఉదయం ఒకసారి, అర్ధరాత్రి మరోసారి ఎస్ఎంఎస్-1లో వేర్వేరు ప్రమాదాలు సంభవించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ తాజా ఘటనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టకుండా పనులు ప్రారంభించడమే ఈ పరిస్థితికి కారణమని కార్మికులు ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని.. కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, భద్రతా చర్యలను పటిష్టం చేయకుండా ఉత్పత్తిపైనే దృష్టి పెట్టడం సరికాదని వారు విమర్శించారు. కార్మికుల ప్రాణాల కంటే ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఎస్ఎంఎస్-1లో పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేసిన తర్వాతే పనులు పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement