విజయవాడ: ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేయడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడమే కాకుండా జీవో సైతం జారీ చేశారు. DBFOT పద్దతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయించారు. పోర్ట్ ఆపరేటర్ ఎంపికకు ఆర్ఎఫ్పిని పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పోర్ట్ అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ అప్పగించడానికి సన్నద్ధమయ్యారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే రామాయపట్నం పోర్ట్ నిర్మాణం చేపట్టారు. సుమారు రూ. 4,929 కోట్లతో నిర్మాణం చేపట్టింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలోనే 90 శాతంపైగా పోర్ట్ నిర్మాణం పూర్తికాగా, ఇప్పుడు దానిని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్) సామర్ధ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్రేక్ ఫీడర్ల నిర్మాణంతో పాటు, డ్రెజ్జింగ్, ఒక బల్్కబెర్తు నిర్మాణం, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాలకు చెందిన బిల్డింగ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.
బల్్కబెర్త్ నిర్మాణం పూర్తికావడంతో రామాయపట్నం పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి మొదటి ఓడను నిలపాలని భావించారు. తరువాత ప్రభుత్వం మారడంతో అది సాధ్యం కాలేదు.


