
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమకు చెందిన నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందనే ఆరోపణలపై రామచంద్రపురం సీఐ వెంకట నారాయణ స్పందించారు. నీలిమ పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తమ విచారణలో 12 పెళ్లిళ్లకు సంబంధించిన ఎటువంటి కచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదన్నారు. గుర్రం రాజేశ్వరి, నీలిమ మధ్య ఉన్న పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు ఒకరిపై కేసులు పెట్టుకున్నారు. కోర్టుల్లో ఆ కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.
వారిరువురి మధ్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు కారణంగానే నీలిమపై అమలాపురం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందని సీఐ అన్నారు. పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై నీలిమ కూడా స్పందించింది. తాను పన్నెండు పెళ్లిళ్లు అంటూ తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని పేర్కొంది. మిగిలిన పదకొండు మంది ఎవరో నిగ్గు తేల్చాలని.. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపింది.