
ఎన్నికల హామీలను గాలికొదిలి చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అరాచకాలపై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటు దినం’కు అనూహ్య స్పందన వచ్చింది. మండుటెండను లెక్కచేయకుండా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి దగాపై కదం తొక్కారు. ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతులు అందజేశారు.
సాక్షి, భీమవరం: వెన్నుపోటు దినం వేదికగా కూటమి ఏడాది పాలనపై ప్రజల్లోని వ్యతిరేకత బుధవారం సుస్పష్టంగా కనిపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని సూర్యప్రతాపం, ఉక్కపోతను ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, పేదవర్గాలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొట్టు సత్యనారాయణ, వెన్నుపొటు దినం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనపై జనాగ్రహానికి వెన్నుపోటు దినం ఘన విజయం సాధించడమే నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటికి గాలికొదిలేసి మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు.
ఇప్పుడు దానినే రిపీట్ చేశారన్నారు. చెప్పినవి చేయకపోగా ప్రజా సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేసిన పథకాలను నిలిపేసి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు తదితర అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలను పెంచేశారని, ఇంటింటికి రేషన్ రద్దు చేశారని, విపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వంచనపై సమాధానం చెప్పాలి: ముదునూరి
నరసాపురం: వైఎస్సార్సీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు నెలనెలా అప్పులు చేస్తూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో సమాధానం చెప్పా లని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. నరసాపురంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ముదునూరి మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు.
జగనన్న కాలనీలో నిరుపేదకుల ఇళ్లస్థలాలు ఇస్తే, నేడు ఆ కాలనీల అభివృద్ధిని ఎండమావి చేశారు. నీకు 15వేలు, నీకు 15వేలు అంటూ ఊదరగొట్టి మహిళలను మోసం చేసిన కూటమి నేతలు నేడు మాట్లాడడం లేదు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారు. అమ్మఒడి పథకం ఎగ్గట్టారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి, ఏడాదిలోనే వేల కోట్ల భారం మోపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టారు. అక్రమ కేసులు పెడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.’ అని దుయ్యబట్టారు.
చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం: కారుమూరి
తణుకు అర్బన్: సంక్షేమం, అభివృద్ధి పథంలో ఏపీని నడిపిస్తానంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో ముసలమ్మ బటన్ నొక్కుతుందని చంద్రబాబు హేళన చేశారని, కూటమి ప్రభుత్వం రాగానే ముసలోడు గట్టిగా నొక్కేస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారని కానీ అసెంబ్లీకి వెళ్లి ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందని అనడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు.
చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని, రైతు భరోసా లేదు, ఫీజురీయింబర్స్మెంట్ లేదు, ధాన్యం డబ్బు వేయలేదు, బీమా లేదు, తల్లికి వందనం వేస్తానని, ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఏడాది గడిచినా ఇవ్వలేదు అని నిలదీశారు. ఎండీయూ ఆపరేటర్లకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. తణుకు ఎమ్మెల్యే పశువధ శాలలో మూగజీవాలను బలి ఇస్తుంటే, స్థానికంగా ఉండలేకపోతున్నామని మహిళలు మొరపెట్టుకున్నా డబ్బుకోసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించడం వెన్నుపోటు కాదా అన్నారు. ఏ పనిచేయాలన్నా కమిషన్, తణుకులో ఆర్కే ట్యాక్స్ విచ్చలవిడిగా అమలవుతుందని చెప్పారు. తణుకులో ఏ పని జరగడం లేదని ప్రజానీకం అల్లాడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు సైతం తిడుతున్నారని దుయ్యబట్టారు.
- నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు
పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలో వెన్నుపోటు దినం విజయవంతంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్లు మేర భారీ నిరసన ప్రదర్శన సాగింది. వాగ్దానాల అమలుకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డులోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎండీయూ వాహన ఆపరేటర్లు ర్యాలీకి మద్దతు పలికారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి హెడ్పోస్టాఫీస్ రోడ్డు, కేఎన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి వైఫల్యాలపై ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ఆచంట వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు.
భీమవరంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేశారు.
పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీగా పాదయాత్ర చేశారు. సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనంద
ప్రకాష్ యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
∙ఉండిలోని వెన్నుపోటు దినం నిరసనలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్
మురళీకృష్ణంరాజు, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమాబాల, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యా లయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు.