
విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
ఉన్నత విద్యా మండలి అధికార పరిధిని కుదించే ఎత్తుగడ
కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదన
ఫలితంగా ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్య శాఖ మధ్య చిచ్చు
అధికారాల మాటున ఆర్థిక అంశాలపై పట్టుకోసం మండలి బలి!
నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ను కాదని ఉన్నత విద్య కార్యదర్శి నియామకాలు చేపట్టడంపై విస్మయం
ఒక్కొక్కటిగా మండలి అధికారాలకు కత్తెర వేస్తూ ఉన్నత విద్య కార్యదర్శి నిర్ణయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగం ఖ్యాతి దిగజారుతోంది. విద్యార్థుల శ్రేయస్సును గాలికొదిలేసి అధికారమే పరమావధిగా పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పది నెలల కాలంలో ఉన్నత విద్యలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టకపోగా ఉన్నవాటికి మంగళం పాడేశారు. తాజాగా ఉన్నత విద్యా మండలిని సైతం నిర్వీర్యం చేసి ఆ స్థానంలో ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు ప్రతిపాదన మండలికి, ఉన్నత విద్యా శాఖకు మధ్య చిచ్చురాజేస్తోంది.
ఉన్నత విద్య శాఖకు, ఉన్నత విద్యా మండలికి నిత్యం పొసగట్లేదు. ఉన్నత విద్య శాఖ కార్యదర్శి పదేపదే ఉన్నత విద్యా మండలి అధికారాల్లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశమైంది. పైగా మండలి చైర్మన్కు తెలియకుండా నియామకాలు చేస్తుండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఉన్నత విద్యా మండలిలో ప్రత్యేక అధికారిగా ముఖ్య నేత సామాజిక వర్గానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని నియమించేలా ఏర్పాట్లు పూర్తయినట్టు, అవి కూడా చైర్మన్కు తెలియకుండానే, చెప్పకుండానే చేసేస్తున్నట్టు వినికిడి.
ఆర్థిక అంశాలపై పట్టుకోసమే ఇదంతా!
ప్రభుత్వాలు తలపెట్టిన విద్యా సంస్కరణల అమలులో దశాబ్దాలుగా ఉన్నత విద్యా మండలి కీలక పాత్ర పోషిస్తోంది. వర్సిటీలను సమన్వయం చేసుకుంటూ సమగ్ర విద్య విధానానికి బాటలు వేస్తుంది. ఆయా ప్రభుత్వాలు విద్యా రంగంలో నిపుణులను చైర్మన్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కూటమి పాలనలో.. ఉన్నత విద్యా మండలి అధికారాలను కాలరాస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుట్రలో భాగంగానే కౌన్సిల్ అధికారాలను పరిమితం చేసి అత్యంత ముఖ్యమైన ఆరి్థక వ్యవహారాలతో ముడిపడిన అంశాలను తమ చేతుల్లో పెట్టుకునేందుకు యంత్రాంగం పావులు కదుపుతున్నట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి.
చైర్మన్ ఉన్నట్టా..లేనట్టా!
ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ కీలకం. ఆయనకే సర్వాధికారాలు దక్కుతాయి. కూటమి పాలనలో చైర్మన్ పదవికి సరైన గౌరవం దక్కట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంస్కరణల్లో కీలకంగా వ్యవహరించే కౌన్సిల్కు తెలియకుండానే, కౌన్సిల్ చైర్మన్ను పిలవకుండానే విద్యా సంబంధిత ఒప్పందాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. పైగా ఉన్నత విద్య కార్యదర్శి కాకుండా కేవలం కళాశాల విద్య డైరెక్టర్ సంతకం చేయడం విద్యాభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.
మరోవైపు ప్రభుత్వం, అధికారులు కావాలనే కౌన్సిల్ చైర్మన్ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నత విద్యపై అప్పడప్పుడూ చేసే సమీక్షలకు సైతం కౌన్సిల్ చైర్మన్కు సమాచారం ఉండట్లేదు. చైర్మన్ అధికారాలను కూడా చేతుల్లోకి తీసుకునేలా ఉన్నత విద్య కార్యదర్శి వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్నత విద్య కార్యదర్శి తన కంటే హోదాలో పెద్దవారైన చైర్మన్కు తెలియకుండానే కాకినాడ జేఎన్టీయూకు చెందిన ఎ.కరుణను డెప్యూటేషన్పై కౌన్సిల్లో సహాయ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ మెమో జారీ చేయడంపై రగడ మొదలైంది.
ఏదైనా ఉంటే లేఖ రూపంలో తెలపాలని, అసలు కౌన్సిల్లో సహాయ ప్రత్యేకాధికారి పోస్టు ఏదీ లేదని మండలి అధికారులు ఉన్నత విద్య కార్యదర్శికి జవాబు ఇచి్చనప్పటికీ, ‘ఆన్ డ్యూటీ’ విధానంలో తాను చెప్పినవారిని నియమించాలని ఉన్నత విద్య కార్యదర్శి నుంచి మరో మెమో రావడంతో కౌన్సిల్ అధికారులు విస్తుపోతున్నారు. పైగా రూసా నిధులకుసంబంధించి చెక్ పవర్ను ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ నుంచి తొలగించిన ఉన్నత విద్య కార్యదర్శి.. దానిని కళాశాల విద్య అధికారులకు ఇవ్వడం గమనార్హం.
అధికారానికై తాపత్రయం..
కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తు కంటే అధికారాన్ని అనుభవించాలన్న తాపత్రయం కనిపిస్తోంది. ప్రభుత్వం వచ్చీరాగానే వర్సిటీల వీసీలను బలవంతంగా రాజీనామా చేయించింది. తీరా పది నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో వీసీలను నియమించలేని దుస్థితి. దీనికితోడు ప్రపంచ స్థాయి వర్సిటీలు అందించే వివిధ రకాల కోర్సులను (వరి్టకల్స్) పేదింటి బిడ్డలకు అందించే తపనతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎడెక్స్ను తీసుకొస్తే దానినీ నిర్లక్ష్యం చేశారు.
వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందికి జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిoది. వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లోనూ తాత్సారం చేస్తుండడంతో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉన్నత విద్య శాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య అంతరాలతో విద్యావ్యవస్థ దెబ్బతింటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.