ఎర్రమట్టి దిబ్బలు, ఇసుక తిన్నెలు, తీర పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
పర్యావరణవేత్తల హెచ్చరికలకు చోటులేకుండా ప్రైవేటు లే–అవుట్ల అభిప్రాయాలకు ప్రాధాన్యం
మధురవాడ–భీమిలి మధ్య తీరప్రాంతాన్ని సీఆర్జెడ్–2గా మార్చేందుకు ప్రయత్నాలు
‘అభివృద్ధి’ పేరుతో తీర ప్రాంత నిబంధనల సడలింపునకు కేంద్రానికి ప్రతిపాదన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాగర తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేందుకు, పర్యాటకం–పరిశ్రమల ముసుగులో విలువైన భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తెరవెనుక శతవిధాలా ప్రయత్నిస్తోంది. మధురవాడ నుంచి భీమిలి వరకు విస్తరించిన సున్నితమైన తీర ప్రాంతాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్)–3 పరిధి నుంచి సీఆర్జెడ్–2కు మార్చాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ మార్పు అమల్లోకి వస్తే ఇప్పటి వరకు నిర్మాణాలపై ఉన్న పరిమితులు గణనీయంగా సడలిపోతాయి. దీంతో తీరప్రాంత భూముల విలువలు ఒక్కసారిగా పెరగడంతో పాటు భారీ రియల్ ఎస్టేట్, రిసార్ట్ ప్రాజెక్టులకు మార్గం సుగమమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి సంపదగా పేరుగాంచిన ఎర్రమట్టి దిబ్బల భవిష్యత్తుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు అడ్డు.. ‘పట్టణీకరణ’ కథ
సీఆర్జెడ్–3 నుంచి సీఆర్జెడ్–2గా ఒక ప్రాంతాన్ని మార్చాలంటే అక్కడ కనీసం 50 శాతం మేరకు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగి ఉండాలి. రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పట్టణ మౌలిక వసతులు సమగ్రంగా అందుబాటులో ఉండాలి. అయితే మధురవాడ–భీమిలి తీర ప్రాంతంలో ఇంకా అనేక కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తికాలేదు. సమగ్ర మురుగునీటి వ్యవస్థ కూడా లేదు.
అయినప్పటికీ ఈ ప్రాంతం ఇప్పటికే పట్టణీకరణ చెందిందన్న వాదనను ప్రభుత్వం ముందుకు తెస్తుండటం వివాదాస్పదంగా మారింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిబంధనలను సడలించేందుకు ముందుగా పట్టణీకరణ జరిగిందనే చిత్రాన్ని సృష్టించి, ఆ తర్వాత నిబంధనల మార్పు కోరుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీసీజెడ్ఎంఏ సమావేశంలో కీలక నిర్ణయం
మే 5న విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ) సమావేశంలో మధురవాడ నుంచి భీమిలి వరకు ఉన్న తీర ప్రాంతాన్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయానికి ఆధారంగా చూపిన ప్రజాభిప్రాయ సేకరణే ఇప్పుడు అనేక అనుమానాలకు కేంద్రబిందువుగా మారింది.
పర్యావరణవేత్తలకు ‘నో ఎంట్రీ’
తీర ప్రాంత పరిరక్షణ, జీవవైవిధ్యం, భవిష్యత్ తరాల ప్రయోజనాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తల అభిప్రాయాలు మాత్రం ఈ ప్రక్రియలో కనిపించకపోవడం మరో కీలక అంశంగా మారింది. విశాఖ తీర ప్రాంతం కేవలం భూమి కాదని, అది ప్రకృతి కవచమని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇసుక తిన్నెలు, చిత్తడి నేలలు, సహజ వృక్ష సంపద తుఫాన్లు, సముద్రపు అలల ప్రభావాన్ని తగ్గించే సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాంటి అభిప్రాయాలకు చోటు కల్పించకుండా కేవలం సీఆర్జెడ్ మార్పును సమర్థించే అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎర్రమట్టి దిబ్బలకు ముప్పు?
2019 సీఆర్జెడ్ నోటిఫికేషన్ ప్రకారం మధురవాడ–భీమిలి ప్రాంతం సీఆర్జెడ్–3 పరిధిలో ఉంది. ఈ నిబంధనల ప్రకారం సముద్ర తీరం నుంచి 200 మీటర్ల వరకు శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. దీంతో సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, జీవావరణ వ్యవస్థలు రక్షణ పొందుతున్నాయి. ఇదే కారణంగా ఈ ప్రాంతంలోని చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యత కలిగిన ఎర్రమట్టి దిబ్బలు ఇప్పటివరకు పెద్దగా దెబ్బతినకుండా నిలిచాయి. కానీ సీఆర్జెడ్–2గా మారితే నిర్మాణాలకు మార్గం సుగమమవుతుంది. దాంతో ఎర్రమట్టి దిబ్బల చుట్టూ నిర్మాణాల ఒత్తిడి పెరిగి, వాటి సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
లేఅవుట్ల యాజమాన్యాల అభిప్రాయానికి ప్రాధాన్యం
ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బల పరిసర ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కూడా సీఆర్జెడ్–3ను సీఆర్జెడ్–2గా మార్చాలని కోరినట్టు తెలుస్తోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి అభిప్రాయాలను కూడా జిల్లా యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పరిగణించినట్లు రికార్డుల్లో నమోదు కావడం. ప్రజా ప్రయోజనాల కంటే ప్రైవేటు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం లభించిందన్న విమర్శలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది.
ప్రజాభిప్రాయమా.. కాపీ–పేస్ట్ అభిప్రాయాలా?
సీఆర్జెడ్ మార్పు వంటి కీలక అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఏపీసీజెడ్ఎంఏ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కానీ ప్రజల స్పందన పేరుతో సమర్పించిన పత్రాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల పేర్లతో నమోదైన అభిప్రాయాలన్నీ దాదాపు ఒకే భాషలో, ఒకే వాక్య నిర్మాణంతో, ఒకే పదజాలంతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పేర్లు మారాయి కానీ అభిప్రాయాలు మాత్రం అక్షరాలా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

పేర్లూ, అభిప్రాయాలు సేమ్ టూ సేమ్
కనీసం ఒక్క పదం కూడా మార్చకుండా ఒకే అభిప్రాయాన్ని పదుల సంఖ్యలో జతచేయడం వెనుక అసలు ప్రజల స్పందన ఉందా? లేక ముందుగానే తయారు చేసిన ముసాయిదాలను వివిధ పేర్లతో జోడించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అభిప్రాయాలను సమర్పించిన వారి పూర్తి చిరునామాలు, సంప్రదింపు వివరాలు కూడా చాలాచోట్ల లేవు. దీంతో ఇవి నిజమైన ప్రజాభిప్రాయాలా? లేక అధికార పార్టీ అనుచరులు సమీకరించి సమర్పించిన పత్రాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


