
విశాఖపట్నం: అధికారులు తమను హింసిస్తున్నారని కొందరు ఖైదీలు లేఖ రాసిన ఉదంతంపై దర్యాప్తు చేపట్టడానికి విశాఖ కేంద్ర కారాగారానికి జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికాంత్ శనివారం వచ్చారు. బయట నుంచి తీసుకువచ్చిన తెల్ల కాగితంపై 25 మంది ఖైదీలు సంతకాలు పెట్టారని తెలిపారు. ఆ లేఖ ఖైదీలు రాసినది కాదని వెల్లడైందన్నారు.
కొందరు ఖైదీలతో ముందుగా తెల్ల కాగితంపై సంతకాలు చేయించారని, ఇచ్చిన కాగితాలపై వేరే వ్యక్తి లేఖ రాసి బయటకు పంపినట్లు తమ విచారణలో తేలిందన్నారు. లేఖపై సంతకాలు పెట్టిన రాజేష్, నాగన్న, మీర్జాఖాన్లతో పాటు 25 మంది ఖైదీలను దర్యాప్తులో భాగంగా ప్రశి్నంచినట్లు తెలిపారు. ఒకరోజు ఒక ఖైదీ పప్పు బాగాలేదని చెప్పడంతో భోజనం బాగాలేదని రాసినట్లు తెలిపారన్నారు.
అధికారులు గతంలో మాదిరిగా జైలు అంతటా ఇప్పుడు తిరగనీయకుండా స్వేచ్ఛ లేకుండా చేశారని, అందుకే లేఖపై సంతకాలు చేసినట్లు వెల్లడించారని డీఐజీ వివరించారు. దీని వెనుక జైలు కిందస్థాయి సిబ్బంది కొందరి హస్తం ఉండి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ ఖైదీ లేఖ రాస్తే ప్రత్యేకంగా జైలు స్టాంప్ వేసిన పేపర్ సరఫరా చేస్తామన్నారు.
కానీ వీరు లేఖ రాయడానికి ఉపయోగించిన పేపరుపై అలాంటి స్టాంప్ లేదన్నారు. బయట పేపరు ఉపయోగించారన్నారు. బయట నుంచి లోపలకు సిబ్బంది ప్రమేయంతోనే ఆ పేపరు చేరుతుందన్నారు. నియమ నిబంధనల ప్రకారం జైలు అధికారులు కచ్చితంగా ఉండటంతో కొందరికి ఇబ్బంది కలిగి ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని తెలిపారు.