స్వర్ణ ప్యాలెస్‌ ఘటన: రమేష్‌బాబు విచారణ

Police Enquiry Started On Swarna Palace Incident - Sakshi

మూడు రోజులపాటు కొనసాగనున్న విచారణ

సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రమేష్‌ కార్డియాక్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబుపై సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు మేష్‌ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించడానికి బెజవాడ పోలీసులు ఇప్పటికే అనేక ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో హోటల్‌ యాజమాన్యానికి రమేష్‌బాబుకు అగ్రిమెంట్‌ ఉందా.. లేదా..?.

ఘటన జరిగిన వెంటనే పోలీసు విచారణకు సహకరించకుండా ఎందుకు వెళ్లిపోయారు..?. అగ్నిప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సరైన సమాధానం చెప్పకుండా ఎక్కడకు వెళ్లారు..?. ఇప్పటి వరకు రమేష్‌బాబునును ఎవరు నడిపించారు..? అంటూ ఇలా అనేక ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది. కోవిడ్‌ లేకపోయినా, లక్షణాలు ఉన్నాయంటూ రోగులను భయపెట్టి లక్షల రూపాయలు నగదు దోచుకున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే అధికంగా డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలపైనా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు. సీఆర్‌పీసీ 41, 160 కింద నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదనే విషయంపైనా పోలీసులు వివరణ కోరనున్నారు. హోటల్‌లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలోనూ మూడు రోజుల కస్టడీలో భాగంగా విచారణ కొనసాగనుంది. 

కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేశ్ బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top