
సాక్షి, విజయవాడ : అక్టోబర్ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఏడాదిలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అనేక మార్పులు తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కీర్తించారు. చంద్రబాబు తమపై ఎన్ని విమర్శలు చేసినా కానీ తాము పనిచేసి చూపించామని స్పష్టం చేశారు. (అందరికీ.. అన్నిటికీ తామై.. )
గ్రామసచివాలయాలు, వాలంటీర్లు కోసం ఐఏఎస్ల శిక్షణ సిలబస్లో పాఠంగా చెప్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేశారని, మన వాలంటీర్ వ్యవస్థను కేంద్ర కేబినెట్ సెక్రటరీ అభినందించారని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా 546 సేవలు, వాలంటీర్ల ద్వారా ప్రస్తుతం 35 సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణను గ్రామస్థాయి నుంచి చేసి చూపిస్తున్నామని, సీఎం జగన్ ఈరోజు ఈ వ్యవస్థ వలన దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. (ఏపీకి 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు)