లక్ష్యం మేరకు మంచినీటి కుళాయిలు | Peddireddy Ramachandra Reddy Comments About Water Taps | Sakshi
Sakshi News home page

లక్ష్యం మేరకు మంచినీటి కుళాయిలు

Nov 12 2020 4:18 AM | Updated on Nov 12 2020 4:18 AM

Peddireddy Ramachandra Reddy Comments About Water Taps - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమ అమలుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈ స్థాయి అధికారులతో  సచివాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. కుళాయిల ఏర్పాటుకు సంబంధించి రెండ్రోజుల్లో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి వేగంగా పనులకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. వారం తర్వాత మరోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆర్‌డబ్ల్యూఎస్, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ విభాగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. 

పనుల పురోగతిపై నిరంతర సమీక్ష
డిసెంబర్‌ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు లక్ష్యం పెట్టుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు స్పష్టం చేశారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షించాలని, టార్గెట్లు పెట్టుకోవాలని సూచించారు. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నాడు–నేడు పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్క్‌ షాపులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంపత్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement