
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు.. గవర్నర్ నజీర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంచార్స్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజా రెడ్డి, బెల్లం దుర్గలు ఉన్నారు.
అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ. . ‘గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించాము. స్థానిక ప్రజాప్రతినిధుల చేస్తున్న ఇసుక అక్రమ రవాణా పై వివరించాము. మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, శాతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి , జగన్ పోన్నూరు టూర్ లో రాళ్ళ దాడిపై వినతిపత్రం అందించాం’ అని అన్నారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘10 అంశాలతో కూడిన వినతి గవర్నర్ కి ఇచ్చాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం , అక్రమ అరెస్టులు అన్ని వివరించాము. గవర్నర్తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. గత హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలు తుడిచిపెట్టే పని మొదలు పెట్టారు..కూటమి నేతలు తల్లికి వెన్నుపోటు పొడిచారు.. 30లక్షల మంది పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని సహజ సంపదని తెలంగాణకి అమ్మేసుకొంటున్నారు’ అని మండిపడ్డారు.