మల్కాపురం: ఇద్దరు చిన్నారులు.. నేవీలో ఉద్యోగం చేస్తున్న భర్త.. సంతోషంగా సాగుతున్న కుటుంబం.. అంతలోనే ఊహించని విషాదం. భర్త ఇంట్లో లేని సమయంలో 15 అంతస్తుల భవనం పైకి వెళ్లిన 22 ఏళ్ల భార్య అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాంక వర్మ (22)కు అదే రాష్ట్రానికి చెందిన దీపక్ వర్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దీపక్ ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో కలిసి నౌసేనాబాగ్ క్వార్టర్స్లోని కావేరి బ్లాక్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం దీపక్ ఇంట్లో లేని సమయంలో ప్రియాంక సమీపంలోని 15 అంతస్తుల గోమతి బ్లాక్ పైకి వెళ్లింది.
అనంతరం అక్కడి నుంచి కిందకు దూకింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే నేవీ పోలీసులకు సమాచారం అందించారు. వారు మల్కాపురం పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. వారు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


