దశాబ్దాల కల సాకారం.. రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా
పారిశ్రామిక ప్రగతికి సోపానం
సాకారమవుతున్న దశాబ్దాల కల
రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా
వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం వరకూ 4 వరుసలు
అచ్చంపేట – ఏడీబీ రోడ్డుకు మోక్షం
కాకినాడ – జొన్నాడ మధ్య హైవే
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ రహదారుల అనుసంధానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రగతికి సోపానం కానుంది. రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితాన్నిచ్చి, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. రాబోయే రెండేళ్లలో జాతీయ రహదారులు అన్ని రంగాల అభివృద్ధిలో కీలకంగా నిలవనున్నాయి. జిల్లాల పునర్విభజన తరువాత జాతీయ రహదారులకు గుర్తింపు, అనుసంధానంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వాణిజ్య సంబంధాలు మెరుగు పడేందుకు సానుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ పోర్టు – సామర్లకోట రైల్వే జంక్షన్, కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సహా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు కీలక రహదారులు జాతీయ హోదాతో నాలుగు వరుసలుగా అభివృద్ధి సాధించనున్నాయి.
మరింత స‘పోర్టు’
విశాఖపట్నం తరువాత ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న కాకినాడ పోర్టు నుంచి ఇతర జిల్లాలకు రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. దీంతో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవకు ఎంపీలు, మంత్రుల సమన్వయంతోడు కావడంతో ఇది సాకారం కానుంది. కాకినాడ పోర్టు నుంచి పామోలిన్ క్రూ డ్, ఎరువుల దిగుమ తులు జరుగుతున్నా యి. ఆఫ్రికా దేశాలకు బియ్యం, సింగపూర్, మలేషి యా వంటి దేశాలకు గ్రానైట్ వంటి ఎగుమతులు జరు గుతున్నాయి. ఇంతటి కీలకమైన రేవును జాతీయ రహదారితో అనుసంధానించడం వలన ఎగుమతి, దిగుమతులు మరింత ఊపందుకునే అవకాశాలు పెరుగుతాయి. కాకినాడ పోర్టుతో అటు అన్నవరం, ఇటు సామర్లకోట జంక్షన్లను జాతీయ రహదారితో అనుసంధానం చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఈ ప్రాంతాల గుండా కాకినాడకు నాలుగు వరుసల హైవే పారిశ్రామిక ప్రగతిలో మేలిమలుపు కానుంది.
చదవండి👉 (సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం)
అచ్చంపేట – పెద్దాపురం ఏడీబీ రోడ్డు
ఈ జాతీయ రహదారికి భూసేకరణ జరుగుతోంది. కాకినాడ సమీపంలోని అచ్చంపేట జంక్షన్ నుంచి ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా 25 అడుగులతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. అచ్చంపేట నుంచి పెద్దాపురం ఏడీబీ రోడ్డు పొడవు 12.25 కిలోమీటర్లు. దీని నిర్మాణంతో సామర్లకోట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సామర్లకోట మండలం నుంచి 12.25 కిలోమీటర్ల భారత్మాల రోడ్డుకు రూ.395.60 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇది ఉండూరు జంక్షన్ నుంచి కాకినాడ – సామర్లకోట రోడ్డులో ముత్యాలమ్మ గుడి, గోదావరి కాలువ మీదుగా వీకే రాయపురం, సామర్లకోట పంచారామ క్షేత్రం వెనుక నుంచి హుస్సేన్పురాన్ని కలుపుతూ సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ మీదుగా రాక్ సిరామిక్స్ సమీపాన పెద్దాపురం ఏడీబీ రోడ్డును కలవనుంది. అచ్చంపేట నుంచి రాజానగరం వరకూ నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారికి ఈ రోడ్డు అనుసంధానం కానుంది. దీంతో రాజానగరం నుంచి కాకినాడ వరకూ ఏడీబీ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.
దశాబ్దాల కల సాకారం
ఇప్పటి వరకూ అమలాపురం నుంచి అంబాజీపేట, ముక్కామల మీదుగా రావులపాలెం వరకూ ఆర్అండ్బీ రోడ్డు ఉంది. దీనిని రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి కత్తిపూడి – పామర్రు 216 జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. 216ఈగా పిలిచే ఈ కొత్త జాతీయ రహదారి అమలాపురం శివారు పేరూరు వై జంక్షన్ నుంచి భట్లపాలెం – ఇందుపల్లి – ఈదరపల్లి – ముక్కామల బైపాస్ రోడ్డు మీదుగా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది. కోనసీమలో కొత్తగా 35 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ రోడ్డు ఆర్అండ్బీ నుంచి ఎన్హెచ్కు బదిలీ అయింది. కొత్త హైవేను ఈదరపల్లి – ముక్కామల బైపాస్ మీదుగా నిర్మించడంతో ఈ 8 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో కోనసీమ వాసుల ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఈ హైవే నిర్మాణంతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల సాకారమవుతోంది.
మూడు ఫ్లై ఓవర్లకు గ్రీన్సిగ్నల్
►ఇటీవలనే ఆమోదం లభించిన జొన్నాడ, మోరంపూడి, దివాన్చెరువు ఫ్లైæఓవర్లతో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం మీదుగా వెళ్లే జాతీయరహదారి 216పై ప్రమాదాలు తగ్గనున్నాయి.
►జొన్నాడ ఫ్లైఓవర్కు రూ.24కోట్లు, మోరంపూడి ఫ్లైæఓవర్కు రూ.56కోట్లు, దివాన్చెరువు ప్లైఓవర్కు ఐదేళ్ల క్రితం రూపొందించిన అంచనా రూ.20కోట్లు అవసరమవుతాయి.
►వందలాది వాహనాలు రాకపోకలు సాగించే మరో కీలకమైన రహదారి కాకినాడ–జొన్నాడ. దీనికి జాతీయ హోదా ప్రయత్నం ఎట్టకేలకు కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైంది.
►కాకినాడ, రామచంద్రపురం, మండపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
►కాకినాడ–అమలాపురం మధ్య జాతీయరహదారి 216 ను కలిపి ద్రాక్షారామ–కోటిపల్లి–అయినవిల్లి మీదుగా ఉన్న రాష్ట్ర రహదారిని కాకినాడ–వేమగిరిని కలుపుతూ ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారి హోదా ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.
వాకలపూడి లైట్ హౌస్ – అన్నవరం
పొడవు: 40.32 కిలోమీటర్లు.
నాలుగు వరుసల రహదారి
అంచనా : రూ.776.82 కోట్లు.
హోదా : ఎన్హెచ్ 516–ఎ‹ఫ్
నిర్మాణ గడువు : రెండేళ్లు