ఆర్థిక వృద్ధిలో ‘దూసుకుపోతున్న’ వాల్తేరు డివిజన్‌

Naresh Salecha Praises Walther railway Division - Sakshi

ప్రశంసించిన రైల్వే బోర్డు ఫైనాన్స్‌ మెంబర్‌ నరేష్‌

విశాఖ డీఆర్‌ఎం కార్యాలయం సందర్శన

సాక్షి, విశాఖపట్నం/ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కోవిడ్‌ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ వాల్తేరు రైల్వే డివిజన్‌ సాధించిన ఆర్థిక ప్రగతి అద్భుతమని రైల్వే బోర్డు మెంబర్‌ ఫైనాన్స్‌ (ఫైనాన్స్‌ కమిషనర్‌) నరేష్‌ సలేచా ప్రశంసించారు. విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయాన్ని శనివారం ఆయన  సందర్శించారు. డివిజన్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు 2020–21లో కోవిడ్‌ సమయంలో వాల్తేర్‌ డివిజన్‌ ప్రగతి, ఆదాయ వనరులు, డివిజన్‌ పరిధిలో చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలు, భద్రతాపనులు, ఇతర అభివృద్ధి పనుల గురించి డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీ వాస్తవ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

రైల్వే స్థలాలు, స్టేషన్‌ పరిసరాల ద్వారా ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో వాల్తేర్‌ డివిజన్‌ వినూత్న పద్ధతుల్ని అవలంభిస్తున్నదని నరేష్‌ సలేచా కొనియాడారు. అన్ని విభాగాల్లోనూ మిగిలిన త్రైమాసికాల్లో ఇదే తరహా వృద్ధి సాధించాలని సూచించారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ అడ్వయిజర్, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఆర్‌.ఎస్‌.మిత్రా, వాల్తేర్‌ డివిజన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రాజారామ్, ఏడీఆర్‌ఎం అక్షయ్‌ సక్సేనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, విశాఖ డివిజన్‌ని కొనసాగిస్తూ.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించగా.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top