
పార్వతీపురం కార్యక్రమంలో ఓ విద్యార్థినికి చెక్ అందజేసిన మంత్రి లోకేష్
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: షైనింగ్ స్టార్స్ పేరిట కూటమి ప్రభుత్వం పంచుతున్న చెక్ల విషయంలో దారుణం జరిగింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పంచిన చెక్కులు చెల్లకుండా పోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై అధికారులను ఆరాలు తీశారు. వివరాల్లోకి వెళ్తే..
పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shinig Stars Cheques) పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ రూ.20 వేల విలువైన చెక్లు అందించారు. అయితే ఆ చెక్లను బ్యాంక్లు వెనక్కి తిప్పి పంపించాయి. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విద్యా శాఖ కార్యాయాల వద్దకు చేరి ఆరాలు తీశారు.
అయితే ఆ చెక్లపై ఉన్న డీఈవో, ఎంఈవోల సంతకాలు సరిపోలేదని చెబుతూ బ్యాంకులు తిప్పి పంపినట్లు తేలింది. దీంతో మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కావడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్లు తీసుకుని విద్యార్థులను వెనక్కి పంపించేశారు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఎక్కడి వారు అక్కడే గప్చుప్!