ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్‌! | Chandrababu Coalition govt failed miserably in teacher transfers | Sakshi
Sakshi News home page

ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్‌!

Jun 16 2025 5:24 AM | Updated on Jun 16 2025 5:24 AM

Chandrababu Coalition govt failed miserably in teacher transfers

ఉపాధ్యాయ బదిలీల్లో ఘోరంగా విఫలమైన సర్కారు

రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందికి స్థానచలనం

రిలీవర్లు లేక పాత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల విధులు

పీఎస్‌ హెచ్‌ఎంలుగా స్కూల్‌ అసిస్టెంట్ల నియామకం

పది శాతమే కొత్త పోస్టుల్లో చేరిక

మిగిలిన వారు పాత పోస్టుల్లోనే కొనసాగింపు

ప్రతిష్టాత్మకమని చెబుతున్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోనూ హెచ్‌ఎంల సమస్య

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీల్లోనూ దారుణంగా ఫెయిలైంది. వేల మంది స్కూల్‌ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌గా చూపి సీనియర్లను కూడా మోడల్‌ స్కూల్‌ ప్రైమరీ హెచ్‌ఎంలుగా పంపింది. అయితే, వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో రిలీవర్లు లేక ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో 9,600 మంది పీఎస్‌ హెచ్‌ఎంల్లో దాదాపు 90 శాతం మంది తిరిగి బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేసి, పాత స్కూళ్లల్లోనే స్కూల్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. మరోపక్క ఆయా స్కూళ్లలో పలు అంశాలపై విద్యాశాఖ అడిగే సమాచారాన్ని అందించాలి. వాటి పర్యవేక్షణ పూర్తిగా ప్రాధానోపాధ్యాయులు మాత్రమే చూడాలి. 

కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కేటగిరీ–3, 4 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన స్టేషన్‌ పాయింట్లతో ప్రస్తుత బదిలీల్లో కేటగిరీ 1, 2 స్కూళ్లకు (పట్టణ, మండల కేంద్రాలు) బదిలీ అయ్యారు. అయితే, వారు పనిచేస్తున్న పోస్టుల్లో కొత్తవారు లేకపోవడంతో పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఎంపీఎస్‌లపై దృష్టి పెట్టి హైస్కూళ్లు నిర్లక్ష్యం
ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా మోడల్‌ స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. వీటిలో పీఎస్‌ హెచ్‌ఎంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. అందుకు తగ్గట్టుగా 9,600 ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా ప్రకటించారు. 

పాఠశాల విద్యాశాఖ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వీటిలో తప్పనిసరిగా హెచ్‌ఎం పోస్టు ఉండాలని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లను మిగులు (సర్‌ప్లస్‌) చూపించి వారినే నియమించింది. అలాగే, ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేస్తామని ప్రకటించింది. 

కానీ, ఎస్‌ఏ ఖాళీలు భారీగా ఉంటే అరకొరగా ఎస్జీటీలకు పదోన్నతులిచ్చింది. దాంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు కరవయ్యారు. ఇప్పుడు చేసేది లేక పీఎస్‌ హెచ్‌ఎంలుగా వెళ్లిన స్కూల్‌ అసిస్టెంట్లను కొత్త పోస్టులో చేరాక.. తిరిగి పాత పోస్టుల్లోనే కొనసాగాలని ఆదేశించింది. 

ఇలా ఎంత కాలం పనిచేయాల్సి వస్తుందో తెలియదని, హెచ్‌ఎంగా వెళ్లామన్న సంతృప్తి లేకుండా పోయిందని బదిలీ అయిన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక కేటగిరీ–3, 4 పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీపై కేటగిరీ 1, 2 స్కూళ్లకు వచ్చినా తిరిగి మారుమూల పాత స్కూళ్లలోనే ఉండిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  

90 శాతం మంది పాత పోస్టుల్లోనే..
పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత బదిలీల్లో దాదాపు 40 వేల మంది టీచర్లను బదిలీ చేసింది. వీరిలో హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు ఉన్నారు. 9,600 మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో 4,706 పీఎస్‌ హెచ్‌ఎం పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్లను నియమించారు. మిగిలిన చోట గతంలో పదోన్నతిపై వచ్చిన ఎస్జీటీలను హెచ్‌ఎంలుగా నియమించారు. 

అయితే, ప్రస్తుతం ఎస్‌ఏల పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమించాల్సి ఉన్నా.. చాలా తక్కువ మందికే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలలను నిర్లక్ష్యం చేయడంతో లెక్కతప్పి హైస్కూళ్లల్లో సిబ్బంది తగ్గిపోయారు. దీంతో పీఎస్‌ హెచ్‌ఎంలుగా వెళ్లిన వారు జిల్లాను బట్టి 70 నుంచి దాదాపు 90 శాతం మంది పాత పోస్టులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కాకినాడ జిల్లాలో మిగులుగా గుర్తించిన స్కూల్‌ అసిస్టెంట్లను పీఎస్‌ హెచ్‌ఎంలుగా పంపించారు. వందల్లో ఖాళీ అయిన పోస్టుల్లో పదుల సంఖ్యలో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేశారు. సోషల్‌ సబ్జెక్టులో 135 పోస్టుల్లో కేవలం 15 పోస్టులనే ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన 120 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 

అలాగే, ఫిజికల్‌ సైన్స్‌లో 89 ఖాళీల్లో 9 మాత్రమే భర్తీ చేశారు, మ్యాథ్స్‌లో 126 ఖాళీలకు గాను 12, బయాలజీలో 136 పోస్టులు చూపి 16 పోస్టులను మాత్రమే ఎస్జీటీలను పదోన్నతిపై భర్తీ చేశారు. మిగిలిన పోస్టుల్లోని ఎస్‌ఏలు బదిలీ అయినా రిలీవర్లు లేక ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వీరు ఇలా ఎంత కాలం అదే పోస్టులో కొనసాగాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement