
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు స్పష్టమైంది. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో విధుల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం సౌమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్కుమార్ ఈ కిడ్నాప్కు పాల్పడ్డాడు. ఇందుకు శరభవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కళ్యాణం ఉమామహేష్, రాగోలు దుర్గావిగ్నేస్ సహకరించారు. వీరు ముగ్గురినీ పోలీసులు వైరామవరం మండలం, పాతకోటలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్దొర, పూసం పవన్ కుమార్లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.
ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్పై గంజాయి కేసుతో పాటు మరో నాలుగు క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్పోస్టులకు అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కదలికలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. శరభవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తరువాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాç³ర్లు కిడ్నాప్కు వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం వద్ద వదలి, మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్లు పేర్కొన్నారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం ద్వారా వారున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని తెలిపారు.