బహుళ ప్రాయోజిత కేంద్రాలకు పచ్చజెండా
తొలి విడతలో 1,255 కేంద్రాల్లో 7,967 యూనిట్ల ఏర్పాటు
రూ.659.50 కోట్లకు పరిపాలనా ఆమోదమిస్తూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా తొలి విడతగా 1,255 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.659.50 కోట్లతో పరిపాలనా ఆమోదమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 2,718.11 కోట్లతో రైతుల ముంగిట మౌలిక సదుపాయాలు (ఫామ్గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో భాగంగా రూ.1,584.60 కోట్లతో 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తొలి విడతగా రూ.659.50 కోట్లతో 1,255 కేంద్రాల్లో 7,967 యూనిట్లు ఏర్పాటు చేస్తుంది.
రెండో విడతలో రూ.925.10 కోట్లతో 1,276 కేంద్రాల్లో 2,716 యూనిట్లు నెలకొల్పనుంది. ప్రధానంగా మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల్లో గొడౌన్స్, డ్రైయింగ్ యార్డ్స్, కోల్డ్ రూమ్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఎస్సైయింగ్ యూనిట్స్, కలెక్షన్ సెంటర్స్ (ఉద్యాన)క్లీనర్స్ అండ్ డెస్టోనెర్స్, పేడీ డ్రైయ్యర్స్, థ్రెషర్స్ను ఏర్పాటు చేయనుంది. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద నాబార్డు ఒక్క శాతం వడ్డీకే ఈ నిధులను సమకూరుస్తోంది. తొలివిడతగా పరిపాలనా ఆమోదం ఇచ్చిన రూ.659.50కోట్లలో రూ.65.94 కోట్లు మార్జిన్ మనీగా పీఎసీఎస్ల ద్వారా చెల్లిస్తారు. మిగిలిన రుణ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది.
సంబంధిత వార్తలు