మీ ఇద్దరిలో సీఎం అభ్యర్థి ఎవరు?

MP Mithun Reddy Serious Comments On Pawan Kalyan And Chandrababu - Sakshi

చంద్రబాబు, పవన్‌కు ఎంపీ మిథున్‌ రెడ్డి సూటి ప్రశ్న 

రాజకీయం అంటే సినిమా కాదు  

పవన్‌షోతో బాబుకు ఓట్లు వేయరు

చిత్తూరు జిల్లా: చంద్రబాబు.. పవన్‌కల్యాణ్‌.. ఇద్దరిలో ఎవరు సీఎం అభ్యర్థి అనేది ప్రజలకు స్పష్టం చేయాలని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పుంగనూరు మున్సిపాలిటీలో ఎంపీ రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం అభ్యరి్థగా చెప్పుకునే జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకట్టడం సిద్ధాంతాలు లేకపోవడమేనన్నారు.


                            ఎంపీ మిథున్‌ రెడ్డి

 స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎత్తుగడలు, పవన్‌కల్యాణ్‌ అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. పవన్‌ కల్యాణ్‌ షోలతో చంద్రబాబుకు జనం ఓట్లు వేయరన్నారు. రాజకీయం సినిమా కాదని.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు వల విసురుతున్నాని చెప్పారు. 2019లో వారిద్దరూ జతకట్టి, కాపుల ఓట్ల కోసం డ్రామాలాడి అభ్యర్థులను నిలబెట్టారని ఎంపీ ఆరోపించారు. రాష్ట్రంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఒక్కటైనా వారికి ఓట్లు పడవని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని వారు ఆర్భాటాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబునాయుడు సభలు, ర్యాలీల్లో అమాయకులను బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుప్పం సభకు ఆయన అనుమతి తీసుకోకపోవడం చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. 

చట్టాన్ని గౌరవించలేని వారు సమాజాన్ని ఏవిధంగా పాలిస్తారని నిలదీశారు. సభలు, రోడ్‌ షోల నిర్వహణపై ఇచ్చిన జీవోను వాళ్లిదరూ చదవాలని సూచించారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ కూడా సినిమా ఈవెంట్లు అనుమతి పొంది నిర్వహించారని తెలియజేశారు. కుప్పంలో చంద్రబాబు నకిలీ పేషెంట్లకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి షో చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఓట్లు వేయమని కోరుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top