తల్లీకొడుకుల కన్నీటి చితి 

Mother And Son Funeral Cremation In Same Day In Srikakulam - Sakshi

సాక్షి, కొత్తూరు: కొత్తూరు గ్రామ ప్రజలు తీవ్ర విషాదానికి గురయ్యారు. ప్రతీ ఒక్కరూ కన్నీంటి పర్యంతమయ్యారు. గ్రామంలోని కొత్తకోటపేట కాలనీకి చెందిన తల్లీ, కుమారుడు కనపాకల చిన్మమ్ముడు (65), కొడుకు శ్రీనివాసరావు (32) శనివారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో చిన్నమ్ముడు అదే రోజు మధ్యాహ్నం మృతి చెందగా.. శ్రీనివాసరావు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తరువాత తనువుచాలించిన విషయం విదితమే. తల్లి మృతదేహానికి పాలకొండ ఏరియా ఆస్పత్రిలో, కొడుకుకు రిమ్స్‌లో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వేర్వేరు వాహనాల్లో మృతదేహాలను కొతూర్తు శ్మశానవాటికకు నేరుగా తీసుకొచ్చారు. దీంతో చిన్నమ్ముడు, శ్రీనివాసరావు మృతదేహాలను కడసారి చూసేందుకు కొత్తూరు గ్రామస్తులంతా అక్కడకు చేరుకొని కన్నీరు పెట్టారు.

ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఇద్దరి మృతదేహాలకు పక్కపక్కనే చితిలు ఏర్పాటు చేసి ఏకకాలంలో దహన కార్యక్రమాలు పూర్తిచేశారు. చిన్నమ్ముడు భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందడం, కొడుకు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో ఎవరూలేరు దీంతో ఆమెకు పెద్ద అల్లుడు, శ్రీనివాసరావుకు మామయ్య తలకొరివి పెట్టారు. పక్కపక్కనే తల్లీకొడుకుల మృతదేహాలు దహనం అవుతుండడాన్ని చూసిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తూరు ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, సర్పంచ్‌ ప్రతినిధి పడాల లక్ష్మణరావు తల్లీకొడుకుల అంతిమ సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
చదవండి: నాన్న ఇక రాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top