విద్యకు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు

Miracles when technology is added to education say Adimulapu Suresh - Sakshi

‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’ లాంచింగ్‌ ప్రోగ్రాంను ప్రారంభించిన మంత్రి సురేష్‌ 

సాక్షి, అమరావతి బ్యూరో: విద్యకు టెక్నాలజీని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ను గురువారం మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఆన్‌లైన్‌ విధానమే ట్రెండింగ్‌ అని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ నూతన పంథాలను ఎంచుకుని వినూత్నంగా ముందుకు సాగుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ లాంచింగ్‌ ప్రోగ్రాం ద్వారా బీబీఏ, ఎంబీఏ కోర్సులను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు చేరువ చేయడం ద్వారా విజ్ఞాన్‌కు ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులను ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పించేలా శిక్షణ ఇస్తామని విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ లాంచ్‌ ప్రోగ్రామ్‌ లోగో, బ్రౌచర్, www.vifnanonine.com వెబ్‌సైట్‌ను మంత్రి, ఎంపీ, హేమచంద్రారెడ్డితో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్, విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తదితరులు ఆవిష్కరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top