నైలెట్ శాశ్వత క్యాంపస్ తరలింపుపై తిరుపతిలో భారీ నిరసన
తిరుపతి సిటీ: విద్యాబుద్ధులు నేర్పిన ఎస్వీ యూనివర్సిటీకే వెన్నుపోటు పొడుస్తూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు విశ్వవిద్యాలయాలను తనకు జన్మనిచ్చిన తిరుపతి జిల్లా నుంచి సీఎం చంద్రబాబు అమరావతికి తరలించడంపై విద్యార్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సీఎం అసంబద్ధ విధానాలపై గళమెత్తారు. శుక్రవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) క్యాంపస్ తరలింపునకు వ్యతిరేకంగా పార్టీల కతీతంగా జెన్జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు.
తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కాక్రోచ్ ప్లకార్డులు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీయ యువత ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగుపరడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పోరాడి మరీ నైలెట్ కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతికి తీసుకొచ్చామని వివరించారు.
కానీ చంద్రబాబు ఇప్పుడు ఈ క్యాంపస్ను అమరావతికి తరలించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తిరుపతి జిల్లా నుంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీలనూ తరలించి తిరుపతి యువతకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైలెట్ క్యాపంస్ను శాశ్వతంగా తిరుపతిలోనే ఉంచాలని, దీనికి 15 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తీవ్ర ప్రతిఘటన తప్పదని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో మాజీ మేయర్ డాక్టర్ శిరీషా, 16 విద్యార్థి, యువజన సంఘాల నేతల పాల్గొన్నారు.


