చికిత్స పొందుతున్న అర్జున అప్పారావు
గాజువాక: స్టీల్ప్లాంట్లో చోటుచేసుకున్న హృదయ విదారక ప్రమాదంలో ఒక ఉద్యోగి తృటిలో తప్పించుకొని స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వడ్లపూడికి చెందిన గుడివాడ అర్జున అప్పారావు బీ షిఫ్ట్ విధులకు వెళ్లారు. డిపార్ట్మెంట్లో 20 అడుగుల ఎత్తులో పని చేస్తున్న ఆయన మూత్ర విసర్జనకని కిందకు దిగి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకొని లాడిల్ పేలిపోయింది.
ఈ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన లిక్విడ్ ఐరన్ అతడి పిరుదులపై కొద్దిగా పడటంతో స్వల్ప గాయంతో బయటపడ్డాడు. తనను ఏ దేవుడో రక్షించాడంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ప్రమాదంలో అతడు కూడా మృతి చెందాడని పుకారు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, అతనికి ఏమీ కాలేదని, స్వల్ప గాయం మాత్రమే అయిందనే విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.


