
యర్రగొండపాలెం(ప్రకాశం): వదిన కుమారుడు మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక బాబాయి గుండెపోటుతో మరణించిన సంఘటన బుధవారం యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆలేటి అఖిల్ మంగళవారం నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి పిన్ని భర్త పెద్దారవీడు మండలంలోని చాట్లమడ గ్రామానికి చెందిన జి.దానియేలు(45) హైదరాబాద్లో బేల్దారి పని చేస్తుంటాడు.
అఖిల్ మృతి విషయం తెలిసి యర్రగొండపాలెం వచ్చాడు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాన్ని చూసిన తీవ్రంగా కలతచెందాడు. అఖిల్ మృతి చెందిన ఫారం పాండ్ పరిసరాలను పరిశీలిస్తూ దానియేలు ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు. బంధువులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో వీరభద్రాపురం, చాట్లమడ గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.