టైం కోసం వేచి చూసి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో.. | Man Attack On Married Woman | Sakshi
Sakshi News home page

టైం కోసం వేచి చూసి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో..

Mar 28 2022 11:43 AM | Updated on Mar 28 2022 12:12 PM

Man Attack On Married Woman  - Sakshi

వీరులపాడు కృష్ణా (నందిగామ): వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని అల్లూరు గ్రామానికి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన యువకుడు యర్రంశెట్టి లక్ష్మీనారాయణ ఆ వివాహితను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, లేకుంటే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఆదివారం ఉదయం వివాహిత ఒంటరిగా ఇంటిలో ఉంది. 

ఆ సమయంలో పూటుగా మద్యం తాగి లక్ష్మీనారాయణ ఆమె ఇంటిలోకి ప్రవేశించి, లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన అతను తనతో తెచ్చుకున్న కత్తితో వివాహితపై దాడిచేసి గాయపరిచాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన వివాహిత భర్త రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చేలోగా తన బైకును అక్కడే వదిలి లక్ష్మీనారాయణ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళను 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాడికి పాల్పడిన లక్ష్మీనారాయణ తన ఇంటిలోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ సోమేశ్వరరావు చెప్పారు. 
 
కఠిన చర్యలు తీసుకోవాలి
వివాహితపై దాడి జరిగిన ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్‌ బాధిత కుటుంబాన్ని ఫోనులో పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement