మోహినీ అవతారంలో జగన్మోహనుడు
గరుడ వాహనంపై శ్రీమలయప్ప కటాక్షం
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న మలయప్ప స్వామిని, శ్రీకృష్ణస్వామిని వేంచేపు చేశారు.
అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి విశేషమైన గరుడ వాహన సేవ కనులపండువగా జరిగింది. గరుడునిపై ఆశీనులై శ్రీమలయప్ప స్వామి భక్తకోటిని కటాక్షించారు.