సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్స్ తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఇదే అదునుగా సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిల్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. కొందరు మద్యం బాక్సులు ఎత్తుకుపోగా, మరికొందరు లుంగీలు, టవల్స్లో బాటిల్స్ వేసుకొని దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని ఎస్.ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం తరలిస్తున్న వ్యాన్ శనివారం ఉదయం బోల్తా పడింది. చిత్తూరు నుంచి కార్వేటి నగరం మండలానికి మద్యం వెళ్తున్న వ్యాన్ టైర్ పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ కింద పడిపోయిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వ్యాన్లోని మద్యం సీసాలు రోడ్డుపై పడిపోవడంతో అటుగా వెళ్తున్న వారు, స్థానికులు దోచుకెళ్లిపోయారు.
కొందరు బాక్సులు ఎత్తుకుపోగా, మరికొందరు లుంగీలు, టవల్స్లో వేసుకొని దోచుకెళ్లారు. సీసాల కోసం ఎగబడినవారిలో మహిళలు సైతం పోటీపడ్డారు. రోడ్డుపై పడిన వాటిలో సగానికిపైగా బాటిళ్లను ఖాళీ చేశారు. సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిల్లను తీసుకెళ్లిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికి కొన్ని బాటిల్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి.


