రొంపిచెర్ల : పిల్లలకు పోటీ తత్వం అవసరమని, విద్యార్థులకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని కలెక్టర్ సుమిత్కుమార్ కోరారు. శుక్రవారం రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0లో ఆయన మాట్లాడారు. ఒక విద్యార్థికి నెలకు రూ. 5వేల నుంచి రూ.7,500 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయుల వేతనాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, ఇతర విద్యా సదుపాయాలన్నీ అందులో భాగమేనని వెల్లడించారు. పిల్లలు ప్రయోజకులైతే కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుందన్నారు. జిల్లాలో 2వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిలో 25 బడుల్లోని విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఓ లక్ష్మీ నారాయణ, డీవైఈఓ ఇందిర, తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, అమరశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దాతల చేయూత అభినందనీయం
విద్యాభివృద్థికి దాతల చేయూత అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి వ్యాపారవేత్త సురేంద్రబాబు రూ.18 లక్షలతో నిర్మించిన స్టేజ్ను కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థి సురేంద్రబాబు తాను చదివిన పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. తన తల్లిదండ్రులు శివలింగమ్మ, వెంకటరత్నం జ్ఞాపకార్థం తరగతి గదులను నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. సురేంద్రబాబును అందరు అదర్శంగా తీసుకోవాలని సూచించారు.


