
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర విషాదం క్రీడాభిమానులు అందరినీ విచారంలోకి నెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో 18 ఏళ్ల ఎదురుచూపులు తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కప్పు గెలవడంతో విజయోత్సవాలు జరిగాయి. అయితే జనం అంత స్థాయిలో వస్తారని ఊహించలేదో.. పోలీసుల నిర్లక్ష్యమో తెలియదు కాని 11 మంది నిండుప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గాయాలపాలయ్యరు. దీనిపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీనిని స్వాగతించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు జట్టు ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. సిటీ పోలీస్ కమిషనర్తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.
ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగు వారికి కొన్ని ఘటనలు గుర్తుకు వస్తాయి. రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఘటనపై అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా స్పందించలేదు. అంతేకాదు.. కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ ర్యాలీలలో, తిరుపతి, సింహాచలం పుణ్యక్షేత్రాలలో జరిగిన ఘటనల్లో పలువురు మరణించినా తూతూ మంత్రపు చర్యలే జరిగాయి. న్యాయ వ్యవస్థ స్పందించినట్లు కనబడదు. పాలన, న్యాయ వ్యవస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించవచ్చా?.
బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ప్రజలు ఫ్రెంజీ అవుతారనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నమెంట్ జట్లలో స్థానికత నేతి బీరకాయ చందమే. బెంగుళూరు జట్టులో స్థానికులు లేదా కర్ణాటకకు చెందిన వారు అతి కొద్ది మంది. టోర్నీ మొత్తం వ్యాపారమే. క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంటారు. ఈ మొత్తాలు ఆట సమయంలో వారిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి కూడా. బాగా ఆడలేకపోతే నిర్వాహకుల ఆగ్రహానికి గురవుతూంటారు. లక్నో జట్టుకు ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ను టీమ్ యజమాని బహిరంగంగా నిందించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇది కూడా ఒక కోణం. ఒక్కొక్క జట్టు రెండేసి సార్లు మరో జట్టుతో తలపడేలా ప్లాన్ చేశారు. పోటీల నిర్వహణ తీరును మనం తప్పు పట్టనక్కర్లేదు. సుమారు 18 ఏళ్లుగా దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న టోర్నీ ఇది. బెట్టింగులు కూడా జోరుగా సాగుతుంటాయని అంచనా. ఆటను ఆటగా చూడడం వరకు ఓకే కాని అది పిచ్చిగా మారకూడదు.
బెంగుళూరు జట్టు గెలిచిన మాట నిజం. కానీ, అందులో ఎందరు ఆ నగరం లేదా రాష్ట్ర ప్లేయర్లు ఉన్నారు?. దానిని కూడా గమనించకుండా గెలిచిన జట్టును అభినందించడానికి వేలు, లక్షల సంఖ్యలో తరలి రావడం ఏమిటి?. ఫలితంగా తొక్కిసలాట జరగడం ఏమిటి?. అంతమంది మరణించడం ఏమిటి. కొన్ని యూరప్ దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఘర్షణలు చోటు చేసుకుని అనేక మంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించదు. అంతవరకు బాగానే ఉందనుకుంటే ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించి తొమ్మిది ప్రశ్నలు వేసి వివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నగర పోలీస్ కమిషనర్ దయానంద్, మరో ఐదుగురిని సస్పండ్ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులను కూడా అరెస్టు చేశారు. యజమానులను అరెస్టు చేయాలని చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.
కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇందులో అర్జున్ తప్పు ఏ మేరకు ఉందన్న మీమాంస ఉంది. చంద్రబాబు గత టర్మ్లో రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఆ తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు కుటుంబం. వీఐపీ ఘాట్ వద్ద కూడా సామాన్య ప్రజలకు కేటాయించిన ఘాట్లో స్నానం చేయడం, దానిని ప్రచార డాక్యుమెంటరీగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించడం, ఆ క్రమంలో జనం పెరిగిపోయి గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట సంభవించడం జరిగింది.
ఆ తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కూడా మాయమైందని చెబుతారు. ఇంతమంది మృతి చెందిన ఘటనపై ఆనాటి న్యాయ వ్యవస్థ స్పందించలేదు. అలాగే పాలనా వ్యవస్థ కనీసం సీనియర్ అధికారులను కాదు కదా!.. ఒక్క కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా బయటకు వస్తాయనే కదా! న్యాయ విచారణ కు ఆదేశం అంటూ ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేశారు. ఆయనేమో ఇదంతా మీడియా ప్రచారం వల్ల అని తేల్చారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబేమో ప్రమాదాలు ఎక్కడ జరగడం లేదు.. పూరీలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా.. అంటూ పుష్కరాల తొక్కిసలాట మరణాలను తక్కువ చేసే యత్నం చేశారు.
అదే కాదు.. తిరుపతి శేషాచలం కొండలలో 20 మంది ఎర్ర చందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఆశించిన రీతిలో స్పందించ లేదన్న విమర్శ ఉంది. ఆ కూలీలు తమిళులు కావడంతో అక్కడి ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణిస్తే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని గుర్తించింది. ఈ మధ్యనే తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలపై న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోలేదు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ తాగి రోడ్డుపై అల్లరి చేసి ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే అప్పట్లో హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించిందింది. అదేమీ తేలలేదు. అది వేరే విషయం.
మరి కొద్ది రోజుల క్రితం తెనాలిలో ముగ్గురు దళిత, ముస్లిం యువకులను పోలీసులు నడిరోడ్డులో అరికాళ్లపై లాఠీలతో కొడుతూ హింసించి వీడియో తీస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదో తెలియదు. న్యాయ వ్యవస్థలు కొన్ని ప్రభుత్వాల పట్ల సానుకూల ధోరణితో, మరికొన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలో నెలకొంది. ప్రత్యేకించి ఏపీలో జగన్ టైమ్లో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరుపై చాలా విమర్శలు వచ్చేవి. చంద్రబాబుకు ఎప్పుడో అరుదుగా తప్ప న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు రావన్న భావన నెలకొంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా, ధర్మం, న్యాయాలను బట్టి వ్యవస్థలు స్పందించడం అవసరం అని చెప్పవలసి ఉంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.