నెల్లూరు: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు, అతనిపై కేసులపై కేసులు మోపడం వంటి అంశాలపై స్పందించారు. ప్రశ్న రావణ్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధమూ లేదు. రావణ్ టీడీపీకి చెందిన వ్యక్తేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందని తెలిపారు.
‘‘చంద్రబాబు, లోకేశ్ను ప్రశంసిస్తూ ప్రశ్న రావణ్ అనేక వీడియోలు పోస్ట్ చేశాడు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని విషప్రచారం చేశారు. దేవుడి దర్శనం కోసం ఆలయాలకు వచ్చిన భక్తుల ప్రాణాలు తీశారు’’ అని కాకాణి తెలిపారు.
కాకాణిపై కేసును కొట్టేసిన హైకోర్టు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. రైతులకు అండగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు గతంలో కాకాణి నిరసన తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పొదలకూరు పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది హైకోర్టు.


