స్కిల్‌ మస్తు.. జాబ్‌ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ

Jobs To Unemployed With Training In Skill Development Centre - Sakshi

మార్కాపురం(ప్రకాశం జిల్లా): డిగ్రీ పట్టా ఉంటే చాలదు.. ఉద్యోగం సాధించాలంటే టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యం అవసరం.. ఆ దిశగా రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నియోజకవర్గానికో స్కిల్‌ హబ్, జిల్లాకో స్కిల్‌ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ద్వారా స్థానికంగా డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. నిరంతరం జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో 7,147 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఐదేళ్లపాటు ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను పటిష్టపరచడం, సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా పెద్ద పెద్ద నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అధికారులు జిల్లాలో 10 స్కిల్‌ హబ్‌లు, ఒంగోలు నగరంలో 2 శిక్షణ కేంద్రాలతో పాటు స్కిల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అదనపు అర్హత లేకపోయినా డిగ్రీ పాసై ఉంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో మొత్తం 23,853 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 7,147 మంది నెల్లూరు, చిత్తూరు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మెగా జాబ్‌మేళా, మూడో మంగళవారం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. స్థానికంగా డిమాండ్‌ ఉన్న కోర్సులను గుర్తించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్నారు.

ఒంగోలు నగరంలో బాలురు, బాలికల ఐటీఐల్లో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బాలికల ఐటీఐలో ప్రత్యేకంగా మహిళల కోసం హౌసింగ్, ఎల్రక్టీషియన్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. మరో కేంద్రంలో ఇండ్రస్టియల్, పిట్టర్‌ ఎరోకేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. గిద్దలూరులో సెక్యూరిటీ గార్డు, టెలీకాలర్స్, కొండపిలో రిటైల్‌ అసిస్టెంట్, అసిస్టెంట్‌ బ్యూటీషియన్, దర్శి, మార్కాపురంలో ఇండ్రస్టియల్‌ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. సంతనూతలపాడులో సీయింగ్‌ వెకేషన్, బ్యూటీథెరపిస్టులో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో 90 మందితో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మెండుగా ఉపాధి అవకాశాలు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానికంగా డిమాండ్‌ ఉన్న కోర్సులను గుర్తించి యువతకు శిక్షణ ఇస్తున్నాం. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను అమలు చేస్తున్నాం. ప్రతి నెలా 15 నుంచి 25 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. 8 నియోజకవర్గాల్లో 10 స్కిల్‌ హబ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇండ్రస్టియల్‌ ఎల్రక్టీ షియన్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్‌ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. త్వరలో ఒంగోలులో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.  
– లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి 

చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా 
నా పేరు శేషుకుమారి. మాది రామసముద్రం. పీజీ చదివాను, జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్‌ చేస్తున్నా. నెలకు రూ.14 వేల జీతం. హ్యాపీగా ఉన్నాను. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా నిర్వహించిన జాబ్‌మేళాలో ఈ అవకాశం దక్కింది. 
– జే శేషుకుమారి

ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా
నా పేరు జీ రమేష్‌. మాది పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామం. గుంటూరులో బీటెక్‌ చేశా. ఇటీవల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరై బైజూస్‌ సంస్థలో ఎడ్యుకేషన్‌ కౌన్సిలర్‌గా ఎంపికయ్యా. ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీ. 
– జీ రమేష్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top