
బిడ్డ ప్రాణం పోతుందన్నా కనికరం లేదా?
సోషల్ మీడియాలో ఓ జనసేన కార్యకర్త ఆవేదన
చిత్తూరు జిల్లా: ‘కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరా? బిడ్డకు లివర్ మార్పిడి సర్జరీ కోసం సీఎం చంద్రబాబును కలిసేందుకు సిఫార్సు లేఖపై సంతకం పెట్టమని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని అడిగితే స్థానిక టీడీపీ నాయకుల మాటలు విని సంతకం పెట్టలేదు. నా బిడ్డ చనిపోయింది’ అంటూ చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కైగల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే జనసేన కార్యకర్త మృతి చెందిన బిడ్డ, లేఖ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్గా మారింది.
అందులోని విషయం ఏమిటంటే...
శ్రీనివాసులు జనసేన పార్టీ కార్యకర్త. కూలీ చేసుకునే ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి కాలేయం దెబ్బతింది. దీంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితే వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని, అందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సిఫార్సు సంతకం కోసం వెళ్లగా ఆయన లోకల్ నాయకుల మాట విని సంతకం పెట్టలేదు. పరిస్థితి విషమించి ఈ నెల 24న ఆ పాప మృతి చెందింది.