5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు

jagananna Thodu For Small Traders In AP - Sakshi

బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు అందజేత

అసలు చిరు వ్యాపారులు చెల్లిస్తే.. వడ్డీ సర్కారు చెల్లిస్తుంది     

మొత్తం 9.65 లక్షల మందికి అండగా నిలవాలని లక్ష్యం

ఎప్పటికప్పుడు బ్యాంకులతో మాట్లాడుతున్న అధికార యంత్రాంగం

మార్చి ఆఖరుకు మిగతా వారందరికీ రుణం అందేలా చర్యలు

చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ‘జగనన్న తోడు’ పథకం కింద 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందాయి. ఈ పథకాన్ని గత ఏడాది నవంబర్‌ 25న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ పథకం పురోగతిపై ఆయన ఈ నెల 18వ తేదీన సమీక్ష నిర్వహించారు. సుమారు 5.82 లక్షల మంది చిరు వ్యాపారులకు బ్యాంకులు వడ్డీ లేని రుణాలను మంజూరు చేశాయి. ఇందులో 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలను కూడా అందజేశారు. అర్హులైన మొత్తం 9.65 లక్షల మందికి దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించారు. అర్హత ప్రమాణికంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు వలంటీర్లు గుర్తించి వారి దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించారు. అర్హులైన మిగతావారికి కూడా మార్చి నెలాఖరులోగా రుణాలను మంజూరు చేయిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. ఇటీవల సీఎం సమీక్ష సందర్భంగా మిగతా దరఖాస్తులకు కూడా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను మార్చి ఆఖరుకు మంజూరు చేయించాలని ఆదేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లను తరచూ జిల్లా అధికారులు సందర్శించి, బ్యాంకు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నామన్నారు.ప్రతివారం జేసీలతో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. 

ప్రైవేట్‌ అప్పుల నుంచి ఉపశమనం 
► అసలు చిరు వ్యాపారులు చెల్లిస్తే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీ లేని రుణం కోసం గుర్తించిన చిరు వ్యాపారులకు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నారు. 
► ఫుట్‌ పాత్‌లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే వారు, రహదారుల పక్కన తినుబండారాలు అమ్ముకునే వీరు, కలంకారీ పనులు, ఏటి కొప్పాక బొమ్మలు, మట్టి పాత్రలు, తోలుతో బొమ్మలు చేసే వారు, బొబ్బిలి వీణల తయారీదారులు వంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం కింద పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నారు. 
► ఇలాంటి చిరు వ్యాపారులు రోజు వారీగా ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్తుల నుంచి ఎక్కువ వడ్డీకి పెట్టుబడి తీసుకోవడం వల్ల.. వారు రోజంతా పడిన శ్రమ, సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలు చెల్లించేందుకే పోతోంది. వీరి కష్టాన్ని స్వయంగా పాదయాత్రలో గమనించిన వైఎస్‌ జగన్‌ వారి కష్టాన్ని తీర్చేందుకు ఈ పథకం ప్రారంభించారు.  

రుణాలు మంజూరైన చిరు వ్యాపారుల వివరాలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top