
సాక్షి, విజయవాడ: జగనన్న సురక్ష సర్వే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి 51.14 లక్షల వినతులకు గ్రామ సచివాలయ ఉద్యోగులు పరిష్కారం చూపారు. జులై 11న అత్యధికంగా ఒకేరోజు 6.25 లక్షల వినతులను పరిష్కరించడంతో.. ప్రజా వినతుల పరిష్కారంలో ‘జగనన్న సురక్ష’ సరికొత్త రికార్డ్ సృష్టించింది.
కేవలం 17 రోజుల్లోనే 9,721 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి చేశారు. లక్ష 73 వేల క్లస్టర్లలో 84.11 లక్షల ఇళ్లను వలంటీర్లు సందర్శించారు. దీంతో ఏపీ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ మరో అరుదైన ఘనత సాధించింది.
కాగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఏ సంక్షేమ పథకమైనా, ధ్రువపత్రామైనా అందని అర్హులకు అండగా నిలిచే సేవా యజ్ఞాన్ని చేపట్టింది. ‘జగనన్న సురక్ష’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి విజయవంతంగా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడటంతోపాటు జనన, మరణ, కుల, ఆదాయ, సీసీఆర్సీ, రేషన్కార్డు విభజన వంటి 11 రకాల ధ్రువపత్రాలను జగనన్న సురక్ష గ్రామసభల ద్వారా అందిస్తున్నారు. ఫలితంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.