సాగర తీరాన సమర భేరి | international maritime events on February 15 at Visakhapatnam | Sakshi
Sakshi News home page

సాగర తీరాన సమర భేరి

Feb 6 2026 5:59 AM | Updated on Feb 6 2026 5:59 AM

international maritime events on February 15 at Visakhapatnam

విశాఖ ముంగిట ప్రపంచ నౌకాదళాల కవాతు!

ఈ నెలలో మిలాన్‌–2026,  ఐఎఫ్‌ఆర్‌ సంబరం 

60కి పైగా దేశాల నుంచి యుద్ధ నౌకల రాక 

18న రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫ్లీట్‌ రివ్యూ’ 

19న మిలాన్‌ ప్రారంభం, అదే రోజు సాయంత్రం సిటీ పరేడ్‌

విశాఖ సిటీ : భారత నావికాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదిక అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 25 వరకు తీరం అంతర్జాతీయ నౌకా బలగా లతో కిక్కిరిసిపోనుంది. ఈ నెలలో 18వ తేదీన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌), 19న మిలాన్‌– 2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్‌ ఓషన్‌ నావల్‌ సింపోజియం(ఐఓఎన్‌ఎస్‌) సదస్సుకు అతిథ్యమిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈనెల 21 నుంచి 25 వరకు భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మిలాన్‌–2026 సీ ఫేజ్‌’ విన్యాసాలకు మెరుగులు దిద్దుకుంటోంది.  

దశాబ్ద కాలం తర్వాత ఐఎఫ్‌ఆర్‌ 
సముద్ర భద్రత, సహకారం, స్థిరత్వం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్‌ రివ్యూ ఉంటుంది. దేశ చరిత్రలోనే మొదటి సారిగా అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షను 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్‌ఆర్‌–2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఫ్లీట్‌ రివ్యూకు ’యునైటెడ్‌ త్రూ ఓషన్స్‌’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. తీరప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, కొత్త సాంకేతికత అనే అంశాలపై ఫ్లీట్‌ రివ్యూలో చర్చించనున్నారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి తీరం వరకు సముద్ర గర్భంలో భారత రక్షణ శక్తి సామర్థ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. 

రాష్ట్రపతి సమక్షంలో ‘ఫ్లీట్‌ రివ్యూ’ 
ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈనెల 18న జరగనుంది. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము విశాఖ తీరంలో జరిగే నౌకల కవాతుకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమె ప్రెసిడెన్షియల్‌ యాచ్‌లో నౌకాదళ విన్యాసాలను పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన సుమారు 90 యుద్ధ నౌకలు, 45 విమానాలతో పాటు సుమారు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు సముద్రంలో బారులు తీరి రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. 

ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు 
ఐఎఫ్‌ఆర్, మిలాన్‌ విన్యాసాలకు భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ఈ వేదికపై ప్రపంచానికి చాటి చెప్పనుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు ఉంటే, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. విమానవాహక నౌకలు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్‌ సబ్‌ మెరైన్లు పాల్గొంటాయి. అలాగే అత్యాధునిక డిస్ట్రాయర్లు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం, తారాగిరి సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విన్యాసాలను భారత నేవీ ప్రదర్శించనుంది. గగనతలంలో నౌకాదళానికి చెందిన మిగ్‌–29కె ఫైటర్‌ జెట్లు, పి–8ఐ నిఘా విమానాలు, సముద్రపు గద్దలుగా పేరుపొందిన ఎంహెచ్‌–60ఆర్‌ రోమియో హెలికాప్టర్లు, సీ కింగ్, ధృవ్‌ హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. విదేశీ వైమానిక దళాలకు చెందిన ఆధునిక విమానాలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి. 

60కి పైగా దేశాల భాగస్వామ్యం 
ఐఎఫ్‌ఆర్, మిలాన్‌ కోసం భారత నౌకాదళం మొత్తం 137 దేశాలకు ఆహా్వనం పింపింది. ఇందులో ఇప్పటి వరకు 60కి పైగా దేశాలు భాగస్వామ్యం అవుతున్నట్లు ధృవీకరణ వచ్చింది. ఇందులో 4 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మంది వరకు రానున్నారు. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్‌ వంటి దేశాల నుంచి 23కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడం ప్రారంభమవుతుంది.

విన్యాసాల షెడ్యూల్‌ ఇలా..
ఈ నెల 15న నావల్‌ బేస్‌ వద్ద ‘మిలాన్‌ విలేజ్‌’ ప్రారంభమవుతంది. 21వ తేదీ వరకు భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 
18వ తేదీ ఉదయం అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ ప్రారంభమవుతుంది. 
19వ తేదీ ఉదయం మిలాన్‌–2026 రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా 
ఆరంభమవుతుంది. 

19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్‌ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్‌ జరగనుంది. ఇందులో దేశ విదేశీ నౌకాదళాల కవాతు, ఎయిర్‌ పవర్‌ డెమో (వైమానిక ప్రదర్శన) ఉంటాయి.  
19, 20 తేదీల్లో మిలాన్‌ విన్యాసాల్లో భాగంగా ’హార్బర్‌ ఫేజ్‌’లో అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. 
20న ఐవోఎన్‌ఎస్‌ సదస్సు జరగనుంది. ఇందులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇందులో 25 సభ్యదేశాలు, 9 అబ్జర్వర్‌ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు.  
21 నుంచి 25 వరకు ‘మిలాన్‌’ సీ ఫేజ్‌ విన్యాసాలు జరుగుతాయి.

మిత్ర దేశాల కలయిక..  మిలాన్‌–2026 
ఈనెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా ‘మిలాన్‌–2026’ విన్యాసాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. దీనికి సుమారు 137 దేశాలను ఆహ్వానించారు. ఇప్పటివరకు 60కి పైగా దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. మిలాన్‌ విన్యాసాలు రెండు దళల్లో జరుగుతాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ‘హార్బర్‌ ఫేజ్‌’లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు ‘సీ ఫేజ్‌’ ప్రారంభమవుతుంది. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తాయి.

రక్షణ దళాల సమీకరణ (బలగాల వివరాలు) 
మొత్తం యుద్ధ నౌకలు - 110కి పైగా (భారత్‌ + విదేశీ)
భారత నౌకాదళ నౌకలు  - 90 వరకు 
విదేశీ యుద్ధ నౌకలు - 23 నుంచి 25 విమానాలు 
హెలికాప్టర్లు  - 60కి పైగా 
ప్రధాన యుద్ధ నౌకలు  - ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, విక్రమాదిత్య

పాల్గొనే దేశాలు, ప్రతినిధులు 
అంశం   - వివరాలు 
మొత్తం ఆహ్వానిత దేశాలు  - 137 
భాగస్వామ్యాన్ని ధృవీకరించిన దేశాలు  - 60+ 
విదేశీ ప్రతినిధుల సంఖ్య  -  సుమారు 4వేలు 
విదేశీ నౌకాదళాధిపతులు  -  25 నుంచి 30 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement