విజయవాడ నగరం మీదుగా రావద్దంటూ సర్కారు హూంకరింపులు
అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు
వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేసిన విజయవాడ సీపీ
గుంటూరు పర్యటన జయప్రదంతో దుష్ట పన్నాగం పన్నిన ప్రభుత్వం
కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు రెండురోజుల కిందటే రూట్మ్యాప్ ఇచ్చిన వైఎస్సార్సీపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. జగన్ పర్యటనలప్పుడు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూస్తున్నా, సర్కారు కుయుక్తులు పారడం లేదు. బారికేడ్లు, చెక్ పోస్టులు, ఇతరత్రా అడ్డంకులను అధిగమించి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండటంతో చంద్రబాబు సర్కారుకు దిక్కుతోచడం లేదు.
ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అత్యంత తీవ్రంగా ఉందనే సంకేతాలు వెళతాయని ఆందోళన చెందుతోంది. బుధవారం గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ ప్రజా ప్రభంజనాన్ని చూసి, శుక్రవారం పర్యటనకు మరింత అడ్డంకులు కలిగించేలా కుట్రకు తెరలేపింది. శుక్రవారం కనదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండు, భవానిపురం, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లి, టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. జోగి రమేశ్ను పరామర్శించునున్నారు.
ఈ మేరకు వైఎస్సార్ సీపీ రెండు రోజుల క్రితమే రూట్ మ్యాప్ను విడుదల చేసింది. అయినప్పటికీ గురువారం రాత్రి రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ విజయవాడ సీపీ రాజశేఖరబాబు ద్వారా నోటీసులు ఇప్పించడం ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది.
బెజవాడలో బ్రహ్మరథం పడతారని..
జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసి గట్టిన ప్రభుత్వం, రూట్ మ్యాప్ మార్చడం ద్వారా జనాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు.
పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్లో వెళ్లకండి, ఈ రూట్లో వెళ్లండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పోలీసులూ పెద్ద బాస్ చెప్పిందే తడవుగా, ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతోంది.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నప్పుడూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. దాడిలో పాల్గొన్న వారిపై నామమాత్రం కేసులు పెట్టి, తిరిగి బాధితులపైనే తీవ్ర కేసులు నమోదు చేసి స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు అభాసుపాలయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ట్రాఫిక్ రద్దీ సాకుతో..
ఇదిలా ఉంటే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కనకదుర్గ వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేశ్ ఇంటికి వెళ్లాలని వైఎస్ జగన్కు నోటీసు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు ప్రకటన ద్వారా తెలిపారు.


