గుడ్‌న్యూస్‌: పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం | Interest Free Loans To AP Tobacco Farmers Affected By Cyclone | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం

Jan 5 2023 9:18 AM | Updated on Jan 5 2023 10:21 AM

Interest Free Loans To AP Tobacco Farmers Affected By Cyclone - Sakshi

పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి సభ్యు­లు 28,112 మంది రైతులకు.....

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో మాండూస్‌ తుపాను ప్రభావంతో పొగాకు పంట నష్టపోయిన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన రైతులకు పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని పంట రుణం ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ ఆమోదించారని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు చెప్పారు. గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లా­డా­రు. పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి సభ్యు­లు 28,112 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.28.11 కోట్లు పంపిణీ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. పొగాకు పంట నష్టపోయినట్లు రైతులు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  

రాజమండ్రిలోని సెంట్రల్‌ టూబాకో రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీటీఆర్‌ఐ)కి చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు తుపాను ప్రభావిత పొగాకు పొలాలను సందర్శించి, తక్షణ నష్ట నివారణకు తగు సలహాలు, సూచనలు ఇచ్చా­రని తెలిపారు. సుమారు రూ.25 కోట్ల మేర పొగా­కు రైతులు మాండూస్‌ తుఫాను వల్ల నష్టపోయా­రని తెలిపా­రు. ప్రస్తుతం బ్యారన్‌కు ఇచ్చిన రూ.5 లక్షలు రుణం­కు అదనంగా మరో రూ.50 వేలు రుణం ఇవ్వా­లని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి సిఫారసు చేశామ­ని చెప్పారు. అంతేకాకుండా  పొగాకు పంట నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామ­న్నారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో పొగాకు వేలం జరుగుతోందని, అత్యధికంగా కిలోకు రూ.271 ధర లభిస్తోందని, సగటున కిలోకు రూ.239.16 లభించిందని తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి మాసం చివర కానీ, మార్చి మొదటి వారంలో కానీ ఆక్షన్‌ ప్రారంభమవుతోందని  శ్రీధర్‌బాబు వెల్లడించారు.

ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

Advertisement
 
Advertisement
Advertisement