పెదబయలు: అల్లూరి జిల్లా కుంతుర్ల పంచాయతీ బొర్రనేరోడి(బొడ్డాపుట్టు) గ్రామంలో జ్వరం, పచ్చకామెర్లతో అక్క,తమ్ముడు మృత్యువాత పడ్డారు. బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన అనుగూరు మేరీ (9) జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందగా ఆదివారం ఉదయం ఆమె తమ్ముడు అనుగూరు జీవన్రాజ్ (7) మృతి చెందాడు. గోమంగి మినీ గురుకుల పాఠశాలలో మేరీ 3వ తరగతి, సంపంగిపుట్టు ప్రాథమిక పాఠశాలలో జీవన్ రాజ్ 2వ తరగతి చదువుతున్నారు. వీరు 3 రోజుల నుంచి జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు.
పసరు మందుతో పాటుగా ఆర్ఎంపీ దగ్గర వైద్యం తీసుకోవడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందక 12 గంటల వ్యవధిలో వీరు మృతి చెందారు. వీరి సోదరి అనుగూరు నందిని(22), సోదరుడు అనుగూరు మోషే(5), తండ్రి అనుగూరు కోటిబాబు కూడా జ్వరంతో బాధపడుతుండడంతో వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే, గ్రామంలో మరికొంత మంది కూడా జ్వరాలతో బాధపడుతుండటంతో పెదబయలు పీహెచ్సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.


