
చెలరేగిపోతున్న చీరాల పచ్చనేత
రాత్రింబవళ్లు తేడా లేకుండా యంత్రాలు పెట్టి అక్రమ రవాణా
ఒంగోలు, చినగంజాం, చీరాల, బాపట్ల, పర్చూరు ప్రాంతాలకు తరలింపు
అడ్డుచెబుతున్న భూ యజమానులపై పచ్చమూకల దౌర్జన్యం
పట్టించుకోని మైనింగ్, పోలీసు శాఖలు
బాపట్ల జిల్లా బచ్చులవారిపాలెం వాన్పిక్ భూముల్లో దందాచీరాల పచ్చనేత ఇసుక దందా పతాక స్థాయికి చేరింది. ఇప్పటివరకు పందిళ్లపల్లె, చీరాల ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల నుంచి ఇసుకను తరలించి అమ్ముకున్న ఆ నేత కన్ను ఇప్పుడు వేటపాలెం మండలం బచ్చులవారిపాలెం ప్రాంతంలో ఉన్న వాన్పిక్ భూములపై పడింది. వెయ్యి ఎకరాల్లోని ఈ భూములన్నీ ఇసుకతో కూడుకున్నవే కావడంతో ఆయన ఈ భూముల్లోని ఇసుకను తోడుకుని కాసులు పిండుకుంటున్నారు.
వారం రోజులుగా బచ్చులవారిపాలెంలోని ఆ పచ్చనేత అనుచరులు వెంకట్రావు, అశోక్ వాన్పిక్ భూముల నుంచి రేయింబవళ్లు యంత్రాలు పెట్టి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. రోజూ 50కి పైగా లారీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. తొలుత వాన్పిక్ భూముల నుంచి ఇసుకను తవ్వి బచ్చులవారిపాలెం, ఊటుకూరు రహదారిలో కుప్పలుగా నిల్వచేస్తున్నారు. అక్కడినుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా చీరాల, బాపట్ల, ఒంగోలు, చినగంజాం, కారంచేడు, మార్టూరు, పర్చూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిమాండ్ను బట్టి ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు సమాచారం. -సాక్షి ప్రతినిధి, బాపట్ల
రేయింబవళ్లు ఇసుకను తరలించేస్తున్నారు..
అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. నిజానికి ఈ భూములన్నింటినీ వాన్పిక్కు ఇచ్చాం. ఇప్పుడా భూములపై వాన్పిక్కు హక్కు ఉంటుంది. అయితే.. వారు వచ్చేవరకు భూములిచ్చిన రైతులకు మాత్రమే వాటిపై అధికారం ఉంది. కానీ, అధికార పార్టీ నేతలు భూముల్లోని ఇసుకను రేయింబవళ్లు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.– మోహన్రావు, మాజీ సర్పంచ్, బచ్చులవారిపాలెం
రైతులపై పచ్చమూకల దౌర్జన్యం..
వాస్తవానికి.. బచ్చులవారిపాలెం పరిధిలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూములను వాన్పిక్ కంపెనీ రైతుల నుంచి తీసుకుంది. కోర్టు కేసుల నేపథ్యంలో ఆ భూములను సదరు కంపెనీ వినియోగించలేదు. దీంతో భూములు ఇప్పటికీ రైతుల స్వా«దీనంలోనే ఉన్నాయి. తాము వచ్చేవరకు భూములు మీ స్వా«దీనంలోనే ఉంచుకోవాలని వాన్పిక్ రైతులకు సూచించింది. తాము వచి్చన తర్వాత తగిన పరిహారం ఇచ్చి భూములు స్వా«దీనం చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు రైతులకు చెప్పారు. కానీ, పచ్చనేతలు ఆ భూముల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
కొందరు రైతులు ఈ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పచ్చనేత అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారు. భూములు మీవి కాదని, వాన్పిక్వి అని బెదిరిస్తున్నారు. దీంతో కొందరు రైతులు ఇటీవల వేటపాలెం ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించలేదని తెలిసింది. ఇసుక దోపిడీకి పాల్పడుతున్నది చీరాల పచ్చనేత అనుచరులు కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. దీంతో.. బాధిత రైతులు స్థానిక పెద్దలతో మాట్లాడి జిల్లా కలెక్టర్ను కలిసి ఇసుక దందా వ్యవహారం విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.
మైనింగ్ అధికారులకూ ముడుపులు!
మరోవైపు.. వాన్పిక్ భూముల నుంచి పచ్చనేతలు అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నా మైనింగ్ విభాగం అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులకు తెలిసినా స్పందించడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారి నుంచి నెలనెలా మామూళ్లు పుచ్చుకుంటూ ఫిర్యాదులు పట్టించుకోవడంలేదని బచ్చులవారిపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.