
టీడీపీ సేవలో పేట్రేగిపోతున్న కుప్పం అర్బన్ సీఐ
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు
టీడీపీలో చేరకపోతే అక్రమ కేసులతో జైలుపాల్జేస్తున్న వివాదాస్పద అధికారి
తాజాగా.. కుప్పం మండల కన్వినర్, కుమారుడిపై అక్రమ కేసులు.. జైలుపాలు
సాక్షి టాస్్కఫోర్స్: ఆయన ఓ పోలీసు అధికారి.. నిజాయితీగా, వృత్తిపట్ల నిబద్ధత, అంకితభావంతో ఉండాల్సిన వ్యక్తి.. కానీ, ఆ లక్షణాలేవీ ఆయనలో మచ్చుకైనా కనిపించవు. ఖాకీ యూనిఫాంలో ఉన్న కరుడుగట్టిన ‘పచ్చ’ సైనికుడు. టీడీపీ కార్యకర్తలకంటే ఎక్కువగా పార్టీ కోసం పరితపిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు చేయించి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారు కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు.
కూటమి సర్కార్ రాగానే స్వైరవిహారం
ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ ఎస్ఐ, సీఐగా ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలో పనిచేశారు. హిందూపురంలో పనిచేసే సమయంలో వైఎస్సార్సీపీ నేత చేలూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో నిందితులకు సహకరించారనే కారణంగా ప్రభుత్వం ఆయన్ని వీఆర్కి పంపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల తరువాత కుప్పం అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన తరువాత వైఎస్సార్సీపీ శ్రేణులపై బెదిరింపులు, దౌర్జన్యాలు వంటి వాటితో చెలరేగిపోతున్నారు. 24 గంటలు టీడీపీ కోసమే అన్నట్లుగా పనిచేస్తున్నారు.
పాత కేసులు తిరగదోడుతూ..
తాజాగా.. వైఎస్సార్సీపీ కుప్పం మండల కన్వినర్ మురుగే‹Ù, ఆయన కుమారుడు శ్రీనివాసులుపై ఆయన కన్నుపడింది. వీరిపై ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ కేసులు కూడా ఇప్పటివి కావు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసు ఒకటి కాగా.. 2022లో ఎమ్మారీ్పఎస్, స్థానికుల మధ్య చెరువు పనుల విషయంలో చోటుచేసుకున్న వివాదం మరొకటి.
ఇందులో మురుగేష్, శ్రీనివాసుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కొద్దిరోజులకు ఇరువర్గాల వారు రాజీపడడమే కాక కేసు ఉపసంహరించుకున్నారు కూడా. ఈ కేసులను సీఐ జీటీ నాయుడు ఇప్పుడు తిరగదోడారు. కుప్పం ఎంపీపీ, మండల కన్వీనర్ కుటుంబం టీడీపీ కండువా కప్పుకోలేదన్న కారణంతో శనివారం రాత్రి మురుగే‹Ù, శ్రీనివాస్పై దొంగతనం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
ఈ సీఐ వచ్చాకే దాడులు, కేసులు
కుప్పం అర్బన్ సీఐగా జీటీ నాయుడు బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించడం ప్రారంభమయ్యాయి. కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ హస్తగతం చేసేందుకు జీటీ నాయుడు రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఒక్కొక్కరిని పిలిపించి వార్నింగ్లు ఇవ్వడం ప్రారంభించారు.
‘మర్యాదగా టీడీపీ కండువా కప్పుకో. లేదంటే ఏదో ఒక కేసుపెట్టి జైలుకు పంపుతా’.. అంటూ బెదిరింపులకు దిగారు. తన మాట వినని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. సీఐ బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడి ఐదుగురు కౌన్సిలర్లు, మరో ఐదుగురు ఎంపీటీసీలు టీడీపీలో చేరిపోయారు. ఆ చేరికలు కూడా ప్రత్యేక వాహనంలో అమరావతికి పంపించి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పించిన ఘనుడు ఈ సీఐ.
ఇక తాజాగా.. కుప్పం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన జల్లికట్టులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీని నిర్వహణ వెనుక రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
వైఎస్సార్సీపీ నేతను వెంటాడి మరీ
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ జూలై 21న బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా అర్థరాత్రి కాపుకాచి వీ కోట వద్ద అరెస్టుచేసి కుప్పం పోలీసుస్టేషన్కు తరలించారు. అతన్ని అరెస్టు చెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా.. చంద్రబాబు మెప్పు పొందేందుకు సీఐ జీటీ నాయుడు.. బస్సులో ప్రయాణిస్తున్న నాగార్జున యాదవ్ సెల్ఫోన్ సిగ్నల్ను ట్రాక్చేసి అరెస్టుచేశారు.
ఈ విషయం గురించి వైఎస్సార్సీపీ లీగల్ సెల్, మీడియా ప్రతినిధులు ఆయన్ను నేరుగా ఫోన్చేసి అడిగినా గోప్యంగా ఉంచారు. అరెస్టుచేయలేదే అంటూ బదులిచ్చారు. చివరకు.. నాగార్జున యాదవ్ స్వయంగా తాను కుప్పం పోలీస్టేషన్లో ఉన్నానని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
41ఏ నోటీసులు ఇవ్వటం కూడా చట్ట విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. ఇలా కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు చట్టాన్ని అతిక్రమించి టీడీపీ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ పట్టించుకోకపోవడంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.