
ఇంటికి వచ్చి బలవంతం చేస్తున్న వడ్డీ రాక్షసులు
భూమి రాయించుకుని వేధింపులు
రూ.100కి రూ.45 వడ్డీతో బాధితుల నరకయాతన
20మందికి పైగా బాధితులు.. ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలే టార్గెట్
పోలీసులు వడ్డీ వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం
న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమైన బాధితురాలు
మదనపల్లె రూరల్: ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలను గుర్తించడం, వారికి కొంత నగదు అప్పుగా ఇవ్వడం, షూరిటీగా బ్యాంకు ఖాళీ చెక్కులు, ప్రాంసరీ నోట్లు తీసుకోవడం, ఆపై నూటికి రూ.45 వడ్డీ వసూలు చేయడం, సమయానికి అప్పు చెల్లించలేని మహిళలను తమ కోరికలు తీర్చాలని బలవంతపెట్టడం, లేదా తాము చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తూ నరకయాతనకు గురి చేస్తున్న వడ్డీ రాక్షసుల కసాయి లీలలను బాధిత మహిళ మంగళవారం వెల్లడించింది. తనలాగా మరో 20 మంది ఉన్నారని, వారు బయటకు రాలేక నలిగిపోతున్నారని, తాను ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చానంది.
వారి ఆగడాలకు తాను ఎలా బలైందో, పోలీసులు వడ్డీ వ్యాపారులకు ఎంతగా వంత పాడుతున్నారో.. కన్నీటిపర్యంతం అవుతూ ఆధారాలను మీడియాకు చూపించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీకి చెందిన బాధితురాలి కథనం మేరకు.. పట్టణానికి చెందిన బండి ఆనంద్, అతని భార్య మంజుల, దేవత నగర్కు చెందిన మాజీ సైనికుడు ఏకాంబరరెడ్డి, శేషప్ప తోటలో మటన్ వ్యాపారం చేస్తున్న బండి హరినాథ్, అతని భార్య అనూరాధ పట్టణానికి చెందిన చక్రాయపేట ఖాదర్ వలీ అనే వ్యక్తి ద్వారా, ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలను గుర్తించి, వారికి అవసరమైన నగదు అప్పుగా ఇస్తున్నారు.
రూ.100కి రూ.45 వడ్డీ వసూలు చేస్తున్నారు. వారి వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకుంటే రూ 1,500 మినహాయించుకుని మిగిలిన రూ.8,500 చేతికి ఇస్తారు. వారానికి రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వడ్డీపై వడ్డీ వసూలు చేస్తూ బాధితులను నరకయాతనకు గురి చేస్తున్నారు. తమ అప్పు తీరాలంటే వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అందుకు వేదికగా గుండ్లూరి భారతి పట్టణంలో నడుపుతున్న బ్యూటీ పార్లర్ను ఎంచుకున్నారు. తన భర్త ఉపాధి నిమిత్తం బెంగళూరులో ఉండగా కుటుంబ అవసరాల కోసం ఆనంద్ వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నానని, అందుకు ప్రతిగా రూ.10.5 లక్షలు చెల్లించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
కొత్తపల్లిలో ఉన్న తమ భూమిని సైతం వారికి రాసి ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పు తీసుకున్న సమయంలో తాను ఇచ్చిన బ్యాంకు చెక్కులను, ఒకటి రూ.10లక్షలకు, మరొకటి రూ.ఆరు లక్షలకు దాఖలు చేసి వేధిస్తున్నారని వాపోయారు. అప్పు తీర్చడానికి తాము చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. అతని భార్య మంజుల.. తనకు అనేకమంది అధికారులు, బ్యాంకు వ్యక్తులు తెలుసని, వారితో వ్యభిచారం చేయాలని పదేపదే బలవంతం చేస్తోందన్నారు.

మాజీ సైనికుడైన ఏకాంబరం రెడ్డి వేధింపులపై 2024లో టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అప్పటినుంచి అతని వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయన్నారు. అనూరాధ, హరినాథ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన ఇంటికి వచ్చి తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తనను నరికి చంపుతానని హరినాథ్ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. భారతితో తనకు ఆర్థిక లావాదేవీలు లేకపోయినా తన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి, తప్పుడు మనుషులుగా చిత్రీకరించి, వేధింపులకు పాల్పడుతోందన్నారు. దీంతో తాను కుటుంబానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి ఆగడాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చావుకు వెనకాడబోనని, తన చావుతోనైనా పోలీసులు స్పందించి ఇతరులకు న్యాయం జరిగితే చాలన్నారు. అప్పులు ఇచ్చి మహిళలను సెక్స్ వర్కర్లుగా మార్చాలనుకుంటున్న వడ్డీ రాక్షసుల నుంచి బాధితులను కాపాడేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.