ఉపాధికి గడ్డుకాలం | Granite industries closed down in Srikakulam district | Sakshi
Sakshi News home page

ఉపాధికి గడ్డుకాలం

Aug 19 2024 5:38 AM | Updated on Aug 19 2024 5:37 AM

Granite industries closed down in Srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో మూతపడ్డ గ్రానైట్‌ పరిశ్రమలు

నూతన పాలసీ ముసుగులో మూసివేసిన సర్కార్‌

ఆర్థిక కష్టాల్లో యజమానులు.. పనుల్లేక కార్మికుల పస్తులు

జిల్లాలో ప్రత్యక్షంగా 25 వేలు, పరోక్షంగా 45 వేల మంది ఉపాధికి దెబ్బ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  వ్యవసాయం, మత్స్యకార రంగాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉపాధి దొరికేది గ్రానైట్‌ పరిశ్రమల్లోనే. ఇప్పుడా పరిశ్రమలు మూతబడ్డాయి. నూతన పాలసీ పేరుతో గ్రానైట్‌ పరిశ్రమలను ప్రభుత్వమే మూసివేయించింది. రెండు నెలలుగా గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో పనులు జరగడం లేదు. ఉపాధి లేక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. వారి ఆకలికేకలను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.

ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కార్మికులు.. మళ్లీ వలస బాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 క్వారీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలిíÙంగ్‌ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశి్చమ బెంగాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు.  

కూటమి నేతల పెత్తనం.. 
టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే గ్రానైట్‌ పరిశ్రమలపై కూటమి నేతల పెత్తనం మొదలైంది. మళ్లీ తాము చెప్పేవరకు గ్రానైట్‌ పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని అధికారవర్గాల ద్వారా ఆదేశించారు. దీనికి నూతన గ్రానైట్‌ పాలసీ అనే ముసుగు తొడిగారు. పర్మిట్‌లను ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో గ్రానైట్‌ క్వారీలతో పాటు వాటి అనుబంధ యూనిట్లు అన్నీ రెండు నెలల క్రితమే మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు.

ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్‌ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తీసిన బ్లాక్‌లు ఆరు బయటే ఉండిపోవటంతో కలర్‌ మారి మార్కెట్‌లో విలువ తగ్గిపోయేలా ఉంది. ఫలితంగా గ్రానైట్‌ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది. అటు కార్మికుల ఆకలికేకలు, ఇటు యాజమాన్యాల నష్టాలను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించింది.     

కార్మికుల వేదన వర్ణనాతీతం  
గ్రానైట్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న టెక్కలి మండలంలో కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బొరిగిపేట సమీపంలోని ఓ క్వారీ సూపర్‌వైజర్‌ మాట్లాడుతూ.. తాను టీడీపీ అభిమానినని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మంచి జరుగుతుందని భావిస్తే చివరకు కడుపుకొట్టారని చెప్పారు.

పరిశ్రమలు తెరిపించండి అని కోరడానికి ఇక్కడి మంత్రి వద్దకు వెళితే.. పరిశ్రమ తెరవకపోతే తినడం మానేస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపేట, మెలియాపుట్టి, దీనబంధుపురం, సవర, జాడుపల్లి, నిమ్మాడ తదితర గ్రామాల్లో నివసించే కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు ఆపేసి తమ ఉపాధిపై దెబ్బకొట్టి పస్తులు పెట్టడం ఏంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.    

కాసుల కక్కుర్తి కోసమే..  
గ్రానైట్‌ పరిశ్రమల నుంచి కాసులు ఆశించే ఇలా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 2014–19లో గ్రానైట్‌ కార్యకలాపాలన్నీ మంత్రి సోదరుడు కనుసన్నల్లోనే జరిగేవి. వారి కుటుంబానికి కూడా గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో వాటి ముసుగులో చక్రం తిప్పేవారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రానైట్‌ కంపెనీలపై పెత్తనం కోసం ప్రయతి్నస్తున్నారు. దానికి నూతన పాలసీ అంటూ బూచిగా చూపిస్తున్నారు అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.   

ఉపాధి పోయింది 
మా ఊరికి దగ్గరలో మేలిసతివాడ వద్ద క్వారీలో జాకీ లేబర్‌గా పనిచేస్తుండేవాడిని. క్వారీలు నడవక ఉపాధి పోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో బాగానే క్వారీలు నడచి జీతాలు వచ్చాయి.  –కొర్రాయి నారాయణ, జీడిపేట, వీకేజీ క్వారీ మేలిసతివాడ

గ్రానైట్‌ కార్మికులను రోడ్డున పడేశారు 
కూటమి ప్రభుత్వం గ్రానైట్‌ క్వారీల నిర్వాహణపై ఆంక్షలు పెట్టింది. దీని వలన జిల్లాలోని క్వారీలు, వాటికి అనుసంధానంగా ఉన్న పాలిషింగ్‌ యూనిట్లు, క్రషర్లు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. దీని వలన జిల్లాలో వలసలు ఆరంభమయ్యా­యి. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువత­కు ఉపాధికి ఆసరాగా ఉన్న గ్రానైట్‌ రంగాన్ని కుదేలు చేస్తున్నారు.  –షణ్ముఖరావు, గ్రానైట్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా నాయకుడు

పని లేదు.. బత్తాలు లేవు  
ఈ ప్రభుత్వం వచ్చాక క్వారీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీని వలన పని లేదు. బత్తాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు రేపు అని చెబుతున్నారు కానీ క్వారీలు తెరవడం లేదు. పని లేక పస్తులుంటున్నాం.  –ముఖలింగాపురం అప్పారావు, జాకీ లేబర్, ప్రియాంక గ్రానైట్, జీడిపేట

Advertisement
 
Advertisement
Advertisement