ఉర్సా భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా..? | Former Minister Gudivada Amarnath Challenge To Nara Lokesh | Sakshi
Sakshi News home page

ఉర్సా భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా..?

Jun 3 2025 5:31 AM | Updated on Jun 3 2025 1:29 PM

Former Minister Gudivada Amarnath Challenge To Nara Lokesh

మంత్రి లోకేశ్‌కు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రతి సవాల్‌

మొత్తం ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: ఉర్సా భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం ఫైళ్లను బయటపెట్టడంతో పాటు ఈ అంశంపై  సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రి నారా లోకేశ్‌కు సవాల్‌ విసిరారు. ఉర్సా భూముల వ్యవహారంలో మంత్రి  లోకేశ్‌ చేసిన సవాల్‌కు స్పందిస్తూ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి లోకేశ్‌కు పలు ప్రశ్నలు సంధించారు.

⇒ ఉర్సా కంపెనీకి విశాఖపట్నం ఐటీ హిల్‌లో ఎకరం కోటి రూపాయలకు మూడున్నర ఎకరాలు, కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున రూ.56.36 కోట్లకు కేటాయించామంటూ మీరు ప్రకటించడం ఏంటి? దీనికి సంబంధించిన జీఓ విడుదల కాకుండా ఇప్పుడు మీరు చెప్పడం ఏంటి? 

కుంభకోణం బయటపడ్డ దాదాపు 50 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ప్రకటన చేయడం ఏంటి?  దీనివెనుక నడిచిన తతంగం ఏంటి?

⇒ ఉర్సాకు కేటాయించిన భూమి రేటు విషయమై యాభై రోజులుగా గప్‌చుప్‌గా వ్యవహరించిన మీరు, ఇవాళ అకస్మాత్తుగా మీ బినామీ కంపెనీ గత ఏప్రిల్‌ 21నాడు విడుదల చేసిన ప్ర­కట­నకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ వ్యవహారంలో మీరు మూసేయాల్సినవి మూసేశారా? ఫైళ్లు చింపేసినా, తగలబెట్టినా స్కిల్‌ స్కాం తరహాలో బయటకు వస్తాయి కదా?

⇒  మీరు 2024 అక్టోబర్‌ 25న అమెరికాకు వెళ్లారు. 2024 సెప్టెంబర్‌ 27న అమెరికాలో కంపెనీ రిజిస్టర్‌ అయ్యింది. 2025 ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది.  ఈ పరిణామాల వెనుక అసలు అర్థం ఏంటి? 

⇒  2025 ఏప్రిల్‌ 10న చంద్రబాబు అధ్యక్షతన  సమావేశమై గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేయడం, ఆ తర్వాత ఏప్రిల్‌ 15న కేబినెట్‌లో ఆమోదం వెంటవెంటనే జరిగిపోయాయి. ఏమిటీ మీకు అంత ప్రేమ?

⇒ రూ. 5,728 కోట్ల పెట్టుబడి పెడతామంటున్న ఈ కంపెనీ కేవలం 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ను, లక్ష రూపాయిల పెయిడప్‌క్యాపిటల్‌ను మాత్రమే కలిగి ఉండడం వెనుక అర్థం ఏంటి?  అలాంటి కంపెనీకి రూ.3వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా ఇవ్వడం ఏంటి? 

⇒ ఉర్సా చేసిన ప్రాజెక్టులు ఏంటి? ఆ కంపెనీ సృష్టించిన టెక్నాలజీ ఏంటి? మీరైనా చెప్పగలరా?
⇒  రూ.5 వేల కోట్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక మిడిల్‌ క్లాస్‌ అపార్ట్‌మెంట్లో ఉంది. ఒక కుటుంబం ఎంత కరెంటు బిల్లు కడుతుందో అంతే మొత్తాన్ని ఈ కంపెనీ కడుతోంది. ఇలాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములను అప్పగించడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు?

⇒ ఉర్సాకు ఎకరా రూ.50 కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని అప్పనంగా ఇస్తున్నారు. మరి ఎవరికైనా ఇలాగే ఇస్తారా? 
⇒ ఉర్సా కంపెనీకి చెందిన సతీష్‌ అబ్బూరి 21 సెంచరీ ద్వారా ఎంతో మందిని మోసం చేశారని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇందులో పాలుపంచుకున్నాడని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై మీరెందుకు దర్యాప్తు చేయించడంలేదు. 

⇒ కేశినేని చిన్ని ద్వారా సతీష్‌ అబ్బూరితో ఈ కంపెనీని సృష్టించి దాని ద్వారా విశాఖలో విలువైన 60 ఎకరాలు కొట్టేశారన్న ఆరోపణలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement