సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పరామర్శించారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు భరించలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును పివి.సునీల్ కుమార్, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు (AIMS) సభ్యులు పరామర్శించారు.
క్రాంతి కుమార్ కేసును సీబిఐకి అప్పగించాలని పీవీ సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. క్రాంతికుమార్పై ఉన్న అభియోగాలపై ఇప్పటి వరకూ నిరూపణ జరగలేదు. ఆరోపణలున్నంత మాత్రాన వారం వారం విచారణకు పిలిచి హింసించే అధికారం ఎవరికీ లేదు. ఎంత ఒత్తిడి లేకపోతే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటాడు. మే 21న క్రాంతి కుమార్ కోసం పోలీసులు వచ్చారు. పోలీసులు రావడంతో క్రాంతి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతి కుమార్ను ఎందుకు అంతగా వేధించాలి’’ అంటూ పీవీ సునీల్కుమార్ ప్రశ్నించారు.
‘‘కేసులుంటే కోర్టులు శిక్షిస్తాయి. తక్షణమే క్రాంతి కుమార్ కేసులో సెక్షన్లు మార్చాలి. క్రాంతి కుమార్ ఆత్మహత్యను బీఎన్ఎస్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)గా మార్పు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం క్రాంతి కుమార్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి. 15 రోజుల్లోగా ఈ పరిహారం అందించాలి. క్రాంతి కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగంతో పాటు భూమి ఇవ్వాలి. సీబీఐ విచారణ ద్వారానే క్రాంతి కుమార్కు న్యాయం జరుగుతుంది. క్రాంతి కుమార్ తండ్రి చేసే న్యాయపోరాటానికి నేను అండగా ఉంటా’’ అని సునీల్ పేర్కొన్నారు.


