వైఎస్సార్‌సీపీ­ కార్యకర్తలకు ఆర్థిక సాయం | Financial assistance to YSRCP workers | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ­ కార్యకర్తలకు ఆర్థిక సాయం

Jul 7 2024 5:16 AM | Updated on Jul 7 2024 5:16 AM

Financial assistance to YSRCP workers

కూటమి నేతల దాడుల్లో గాయపడ్డవారికి భరోసా 

తెనాలి/మచిలీపట్నం టౌన్‌/వీరవాసరం: టీడీపీ, జనసేన జరిపిన దాడుల్లో గాయపడిన ముగ్గురు కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్థి క సాయం అందించి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కోలుకుంటున్న వైఎస్సార్‌సీపీ తెనాలి 16వ వార్డు ఇన్‌చార్జి కాళిదాసు సత్యనారాయణను శనివారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు పరామర్శించారు. ఆయనకు రూ.లక్ష ఆర్థి కసాయం అందజేశారు. 

ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మిద్దె బాబీ, అతని భార్యపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన బాబీ దంపతులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా టీడీపీ శ్రేణులు బెదిరించాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కిట్టు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి వివరించారు. 

పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంపిన రూ.50 వేల చెక్కును పేర్ని కిట్టు, నగర మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ.. బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ శీలం భారతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగంపల్లి సాల్మన్‌రాజును ఏఎంసీ చైర్మన్‌ కోటిపల్లి బాలదుర్గా నాగమల్లేశ్వరరావుబాబు, నాయకులు శనివారం పరామర్శించారు. బాధితుడు సాల్మన్‌రాజుకు రూ.50 వేల చెక్కును సాయంగా అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement