విశాఖ: బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై ఇప్పటివరకూ ఎటువంటి ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ ముగిస్తామని ఫిషరీస్ కమిషనర్ ప్రకటించడంతో కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ ఎలా ముగిస్తారంటూ బాధిత కుటుంబాలతో పాటు హార్బర్లోనే పలువురు మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్ట సమయంలో ఇదేనా ప్రభుత్వం వ్యవహరించే తీరు అంటూ మండిపడుతున్నారు.
ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ను గట్టిగా నిలదీయడంతో సెర్చ్ ఆపరేషన్ను ఈరోజు(మంగళవారం, జూలై 7వ తేదీ) రాత్రి12 గంటల వరకూ పొడిగించారు.
బాధిత కుటుంబాలు హార్బర్లోనే ఉండి తమ వారి జాడ ఏమైనా తెలుస్తుందేమోనని కొండంత ఆశతో ఎదురుచూస్తుండగా, ఫిషరీస్ కమిషనర్ సెర్చ్ ఆపరేషన్ ముగింపు వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. తమవారి ఆచూకీ కనిపెట్టాల్సిందేనని మత్స్యకార బాధిత కుటుంబాలు నిలదీయడంతో దాన్ని తూతూ మంత్రంగా రాత్రి 12 గంటల వరకూ పొడిగించారు. ఆ లోపు తమ వారి లభించకపోతే తర్వాత ఏం చేయాలో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.


