ఏపీజెన్‌కో ప్రాజెక్టులో పగిలిపోయిన ఈఎస్‌పీ హాపర్స్‌

ESP hoppers exploded in the Apgenco project - Sakshi

నిలిచిపోయిన విద్యుదుత్పత్తి  

కాంట్రాక్టర్ల నిర్వహణ లోపం

ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్టులో శుక్రవారం 2వ యూనిట్‌కి సంబంధించిన (ఈఎస్‌పీ) యాష్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ హాపర్స్‌ పగిలిపోయాయి. 30 టన్నుల బూడిద సామర్థ్యం కలిగిన 2 హాపర్స్‌ హటాత్తుగా పగిలిపోవడంతో ప్రాజెక్టు అంతా ఫ్లైయాస్‌(బూడిద) వ్యాపించి, దట్టంగా పైకిలేచింది. ఇప్పటికే 1వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిపివేయగా, ఈ ఘటనతో 2వ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది.

బూడిదతో నిండిపోయే ఈ ఇనుప రేకులతో తయారు చేసిన హాపర్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసి, బూడిదను తొలగించాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టు సంస్థ నిర్వహిస్తోంది. అయితే, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, యాష్‌ ప్లాంట్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే, ఈ హాపర్స్‌ నుంచి బూడిద సక్రమంగా వెలుపలకు రాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, పగిలిపోయి ఉంటాయని మరో వాదన వినిపిస్తోంది.

విద్యుత్‌ ఉత్పత్తి జరిగే క్రమంలో నిత్యం వేల టన్నుల ఫ్లైయాస్‌ వెలుపలకు చేరుతుంది. ఈ క్రమంలో 2 హాపర్స్‌ నిండిపోయి, పగిలిపోవడం వల్ల ఈ ప్రాంతమంతా బూడిద అలుముకొంది. పూర్తిగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. దీంతో కిందపడే బూడిదను ట్రాక్టర్ల ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. మండుటెండల్లో విద్యుచ్ఛక్తికి విపరీతమైన డిమాండ్‌ ఉన్న పరిస్థితిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top