మార్చిలో 0.4 శాతం క్షీణత
విద్యుత్, సిమెంట్, ఎరువుల ఉత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల పనితీరు మార్చి నెలలో నిదానించింది. ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 0.4 శాతం తగ్గింది. ఐదు నెలల్లో మౌలిక రంగం ఉత్పత్తి తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, ఎరువులు, విద్యుదుత్పత్తి క్షీణించడం మొత్తం మీద పనితీరును పరిమితం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 మౌలిక రంగాల పనితీరు నికరంగా 2.8% పెరగడం గమనార్హం. 2025–26 మొత్తం మీద ఈ రంగాలు 2.6% వృద్ధిని నమోదు చేశాయి.
2024–25లో వృద్ధి 4.5%తో పోల్చితే చెప్పుకోతగ్గ స్థాయిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 0.1%, స్టీల్ ఉత్పత్తి 2.2%, సిమెంట్ ఉత్పత్తి 4% చొప్పున మార్చి నెలలో తగ్గాయి. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం పెరిగింది. 4 రంగాల ఉత్పత్తి క్షీణించడంతో, ఐదు నెలల్లో తొలిసారి కీలక మౌలిక రంగాల పనితీరు తగ్గినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి సరుకుల సరఫరా తగ్గడం ఎరువుల ఉత్పత్తిని ప్రభావితం చేసినట్టు చెప్పారు. దీంతో మార్చి నెలలో పారిశ్రామిక రంగం (ఐఐపీ) వృద్ధి 1–2%కి తగ్గిపోవచ్చని నాయర్ అంచనా వేశారు. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 5.2%గా ఉంది.


