
దేశంలో ప్రస్తుతం నెలవారీ విద్యుత్ వినియోగం 130.40 బిలియన్ యూనిట్లు
2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా
రాష్ట్రంలో ఏటా 70,361 మిలియన్ యూనిట్ల డిమాండ్
2030 నాటికి 1,04,596 మిలియన్ యూనిట్లకు రాష్ట్ర వినియోగం
రాష్ట్రంలో ప్రస్తుతం 23,805 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు
2030 నాటికి ఈ సామర్థ్యం 87,238 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా
55 శాతం నుంచి 60 శాతంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాటా
పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగ్గట్టు భవిష్యత్ డిమాండ్ను అంచనా వేయకపోతే పరిస్థితులు అంధకారంలో ముంచేస్తాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్లో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలవారీ విద్యుత్ వినియోగం దాదాపు 130.40 బిలియన్ యూనిట్లుగా ఉంది. ఇది 2030–32 నాటికి రెట్టింపు అవుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. – సాక్షి, అమరావతి
ఇదీ అంచనా
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఇటీవల 200 గిగావాట్ల మైలురాయిని దాటింది. 2030 నాటికి 500 గిగావాట్ల్ల సామర్థ్యాన్ని, 2047 నాటికి 1,800 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 457 గిగావాట్లకు చేరుకుంది.
ఇందులో పునరుత్పాదక ఇంధన వాటా 205 గిగావాట్లు (45 శాతం). ఇది ఈ ఏడాది 25–28 గిగావాట్లు పెరుగుతుందని అంచనా. 2030 నాటికి అది 55 శాతం నుంచి 60 శాతానికి చేరుకుంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ప్రస్తుతం ఏటా 70,361 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది.
2030 నాటికి ఇది 1,04,596 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. అదే 2047 నాటికి 4,22,402 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే రానున్న 23 ఏళ్లలో ఇప్పుడున్న దానికి ఆరు రెట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోనుంది.
