తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్‌ బస్సులు | Electric buses to Tirumala stopped | Sakshi
Sakshi News home page

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్‌ బస్సులు

Jul 8 2026 3:03 AM | Updated on Jul 8 2026 3:03 AM

Electric buses to Tirumala stopped

వేతన సమస్య పరిష్కరించాలని డ్రైవర్ల ఆందోళన 

అలిపిరి డిపోకే పరిమితమైన బస్సులు

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎలక్ట్రిక్‌ బస్సుల డ్రైవర్లు మంగళవారం తిరుపతి అలిపిరి డిపోలో ఆందోళనకు దిగారు. దీంతో శ్రీవారి భక్తు­లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం 100 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులుండగా.. తిరుమలకు 67 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఒక్కో డ్రైవర్‌ తన డ్యూటీలో తప్పనిసరిగా ఐదు ట్రిప్పులు వేయా­ల్సి ఉంటుంది. కానీ బస్సు కండీషన్, బ్యాటరీ చార్జింగ్‌ సమస్యలు, ఇతర కారణాలతో మూడు నుంచి నాలుగు ట్రిప్పులు మాత్రమే పూర్తవుతున్నాయి. దీనిని సాకు చూపించి నెల వేతనాన్ని తగ్గిస్తామనడంపై ఏజెన్సీ మేనేజర్‌ను డ్రైవర్లు నిలదీశారు. 

కానీ సరైన సమాధానం రాకపోవడంతో మంగళవారం విధులు బహిష్కరించి.. అలి­పిరి డిపోలో ఆందోళనకు దిగారు. రైలు ప్రయాణికుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో పాటు బస్సు కండీషన్, బ్యాటరీ చార్జింగ్‌ సమ­స్యలు, ఇతర కారణాల వల్ల తిరుమలకు రోజుకు మూడు నుంచి నాలుగు ట్రిప్పులే పూర్తవుతున్నాయని డ్రైవర్లు చెప్పారు.  ఒక్కో ట్రిప్పుకు రూ.375 చొప్పున రోజుకు ఐదు ట్రిప్పులు పూర్తి చేస్తే రూ.1,875 చెల్లిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ కారణగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు డ్రైవర్ల సంఘ ప్రతినిధులతో రవాణా శాఖ డిప్యూటీ సీటీఎం విశ్వనా«థ్, అలిపిరి డిపో మేనేజర్‌ హరిబాబు చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో.. డ్రైవర్లు విధులకు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement